ఎక్కడి వారు అక్కడే ఉండండి

ABN , First Publish Date - 2020-05-29T09:05:11+05:30 IST

కృష్ణలంకలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా రెడ్‌జోన్‌ అమల్లో ఉందని, ఎక్కడి వారు అక్కడే ఉండాలని ..

ఎక్కడి వారు అక్కడే ఉండండి

కృష్ణలంక వాసులకు బయటి ప్రాంతాల్లో వ్యాపారాలకు అనుమతిలేదు

 అవసరమైతే వ్యాపారాలున్న చోటే ఉండండి : సీఐ సత్యానందం


కృష్ణలంక, మే 28 : కృష్ణలంకలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా రెడ్‌జోన్‌ అమల్లో ఉందని, ఎక్కడి వారు అక్కడే ఉండాలని కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ సీఐ పి.సత్యానందం తెలిపారు. గురువారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ గవర్నరుపేట, గాంధీనగర్‌, వన్‌టౌన్‌ తదితర ప్రాంతాల్లో తమ వ్యాపారాలు ఉన్నాయంటూ ఇక్కడి నుంచి ప్రజలు విరివిగా వెళ్తున్నారని, ఇలా చేయడం వల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదముందన్నారు. కృష్ణలంకలో ఉండేవారు ఎలాంటి వ్యాపారాల నిమిత్తం బయటికి వెళ్లేందుకు వీల్లేదని, ఒకవేళ వ్యాపారాలు ఉన్నచోటే నివసిస్తూ కృష్ణలంకలోకి రాకుండా ఉంటే అభ్యంతరం లేదన్నారు.


షాపుల్లో పనిచేసే సిబ్బంది, ఇతర ప్రదేశాల్లో పనిచేసేవారు కూడా కృష్ణలంక నుంచి తండోపతండాలుగా బయటికి వెళ్తున్నారని, పనిచేసే చోట నివాసం ఉండేలా వారు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు పాస్‌లు చూపిస్తూ, మాటిమాటికీ నాలుగైదుసార్లు అటూ, ఇటూ తిరుగుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-29T09:05:11+05:30 IST