ఎంత నీతిపరుడో... కమల్నాథ్పై చౌహాన్ సెటైర్!
ABN , First Publish Date - 2020-10-31T02:52:22+05:30 IST
తాను అత్యంత నీతిపరుడినంటూ మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం శివరాజ్ చౌహాన్ తనదైన శైలిలో కౌంటర్..
భోపాల్: తాను అత్యంత నీతిపరుడినంటూ మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం శివరాజ్ చౌహాన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. వాషింగ్ పౌడర్తో ఉతికినా ఆయన మరకలు పోవంటూ ఎద్దేవా చేశారు. మొరేనాలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో చౌహాన్ మాట్లాడుతూ... ‘‘తనకు ఎలాంటి అవినీతి మరకలూ లేవంటూ కమల్నాథ్ చెబుతున్నారు. కానీ ఆ మరకలు వారి ముఖాల్లోనే కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని ఎక్కడి వాషింగ్ పౌడర్ తెచ్చి వాడినా ఆ మరకలు వదలవు. అందుకే ఆయన తాను స్వచ్ఛమైన వాడినని చెప్పుకోవడం మానుకోవాలి...’’ అంటూ చురకలు వేశారు. ఏడాది పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినా కమల్నాథ్ రాష్ట్ర రైతులకు ఎలాంటి మేలూ చేయలేదని సీఎం ఆరోపించారు. ‘‘మా ప్రభుత్వం రికార్డు స్థాయిలో గోధుమలను కొనుగోలు చేసి పంజాబ్ను వెనక్కి నెట్టింది. చిరుధాన్యాల కొనుగోలు కోసం కూడా ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాం. ఇప్పటి వరకు 22,723 మంది రైతులు దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు...’’ అని చౌహాన్ వెల్లడించారు.