అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికే కన్నం
ABN , First Publish Date - 2021-10-18T04:47:09+05:30 IST
అవసరానికి అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికే కన్నం వేశాడు. రూ. 23 లక్షల వెండి, బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. కానీ చేసిన నేరం దాగదు కదా! పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దొంగ ఆటకట్టించారు.
రూ. 23 లక్షల విలువైన ఆభరణాల చోరీ
వేలిముద్రల ఆధారంగా కేసు ఛేదించిన పోలీసులు
నిందితుడి నుంచి సొత్తు స్వాధీనం
తల్లాడ, అక్టోబరు 17: అవసరానికి అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికే కన్నం వేశాడు. రూ. 23 లక్షల వెండి, బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. కానీ చేసిన నేరం దాగదు కదా! పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దొంగ ఆటకట్టించారు.
24 గంటల వ్యవధిలో కేసు ఛేదించారు
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 24 గంటల వ్యవధిలో నిందితుడిని పట్టుకోని చోరీ కేసును ఆదివారం పోలీసులు ఛేదించారు. దొంగ వద్ద రూ.23 లక్షలు విలువైన బంగారు, వెండి అభరణాల స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం తల్లాడ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైరా ఏసీపీ స్నేహా మెహ్రా వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. తల్లాడ మండలం కుర్నవల్లిలో కట్టా దర్గారావు ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. అరకిలో బంగారం, కిలోన్నర వెండి అభరణాలు అపహరణకు గురయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు చోరీ జరిగిన ప్రదేశంలో క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు సేకరించారు. దర్యాప్తులో భాగంగా దర్గారావు వద్ద అప్పు తీసుకున్న అనుమానితుల వేలిముద్రలను పరిశీలించగా కుర్నవల్లికి చెందిన మాడంగుల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటి వేలిముద్రలు కలవడంతో చోరీకి అతడే పాల్పడినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చి వెంకటిని అరెస్టు చేశారు. అతని వద్ద రూ. 23 లక్షల విలువైన బంగారు, వెండి అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం కేసును చేధించిన వైరా సీఐ జె. వసంత్కుమార్, సీసీఎస్ ఫింగర్ ప్రింట్ విభాగం ఎస్ఐలు కిరణ్, నరేష్, తల్లాడ ఎస్ఐలు జి. నరేష్, సూరజ్ హెడ్కానిస్టేబుల్ అంజనేయులు, కానిస్టేబుళ్లు సత్యం, బాలాజీని ఏసీపీ అభినందించారు. సీసీఎస్ ఎస్ఐ కిరణ్కు నగదు రివార్డును అందజేశారు.