పని ఒత్తిడితో ఉక్కిరి బిక్కిరి
ABN , First Publish Date - 2021-04-13T07:20:35+05:30 IST
ఎదుటివారి ప్రాణం నిలిపేందుకోసం తమప్రాణాలు సైతం లెక్క చేయకుండా రాత్రింబవళ్లు శ్రమిస్తూ వైద్యసేవలు అందిస్తున్న వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందిస్తున్నారు.
పనిభారంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు సతమతం
కరోనా కారణంగా రాత్రింబవళ్లు డ్యూటీలు
నలుగురు పనిభారం ఒక్కరిపైనే..
సెలవులు తోసిరాజని నిరంతర సేవలు
అదనపు భత్యాలు లేకున్నా అహర్నిశల శ్రమ
నిర్మల్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి) : ఎదుటివారి ప్రాణం నిలిపేందుకోసం తమప్రాణాలు సైతం లెక్క చేయకుండా రాత్రింబవళ్లు శ్రమిస్తూ వైద్యసేవలు అందిస్తున్న వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందిస్తున్నారు. తమకేమైనా పర్వాలేదు గాని తమ వద్దకు వైద్యసహాయం కోసం వచ్చే వారిని ఆదుకోవడమే ధ్యే యంగా పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఏడాదికాలం నుంచి ఒక్కరోజు కూడా వ్యక్తిగత అవసరాలకోసం సెలవు దొరకకకున్నప్పటికీ వారు నిరాశ చెందకుండా తమ విధులను భాధ్యతయుతంగా నిర్వర్తిస్తూ ఇతర అన్ని ప్రభుత్వ శాఖలకు స్పూర్తిగా నిలుస్తున్నారు. వైద్య,ఆరోగ్యశాఖలో కుప్పలు తెప్పలుగా అన్ని విభాగాలకు సంబంధించి ఖాళీ లుండడంతో ఒక సిబ్బంది నలుగురైదుగురు ఉద్యోగులు చేయాల్సిన పనులను ఒక్కరే చేస్తున్నారు. ఫిప్టులవారి డ్యూటీలను కేటాయిస్తున్నప్పటికీ ఒకే రోజు రేండేసీషి ప్టులలో కూడా విధులు నిర్వర్తించాల్సి వస్తోందంటున్నా రు. కరోనావైరస్వ్యాప్తి కారణంగా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ఉదయం నుంచి రాత్రి వరకు అలుపెరగకుండా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. కరోనాపరీక్షల నుంచి మొదలుకొని క్వారంటైన్, ఐసోలేషన్లతో పాటు ఇక్కడి ఐసీయూ సెంటర్లలో సేవలందిస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్దసమయంలో డాక్టర్ కొట్నీస్ సేవలను ప్రస్తుతం వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బంది మరిపిస్తున్నారు. నిర్మల్జిల్లా వ్యాప్తంగా వైద్య,ఆరోగ్యశాఖ అందిస్తున్న సేవ లు అంతటా ప్రశంసలు అందుకుంటున్నాయి. రెగ్యులర్ సిబ్బందితో పాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఆసుపత్రుల్లోని పారిశుధ్య సిబ్బంది తమ ప్రాణాలను, ఆరోగ్యాలను లెక్కచేయకుండా కరోనారోగులకు సేవలు అందిస్తూ మన్ననలు పొందుతున్నారు. అయితే ఇంతగా చేస్తున్నగాని వారికి మాత్రం ప్రభుత్వం ప్రత్యేక అలవెన్స్లు అందించడం లేదన్న ఆరోపణలున్నాయి. మండెటెండల్లో కరోనాపరీక్షలు చేస్తూ వారంతా ఆలసిపోతున్నారు. ఇళ్లల్లో శుభకార్యాలకు, ఇతర వ్యక్తిగతపనులకు ఒక రోజు సెలవు కూడా వారికి మంజూరు కావడం లేదంటున్నారు. అయితే ప్రస్తుతం వైద్య,ఆరోగ్యశాఖలో 10 నుంచి 20వేలలోపు వేతనంతో వందలాది మంది ఔట్సోర్సింగ్, కాంట్రా క్ట్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ నియమకాలు సక్రమంగా జరగకపోతున్న కారణంగా అన్నింటి కీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులే బుక్కవుతున్నారు. 70 శాతం హెల్త్అసిస్టెంట్లు, 80 శాతం ఏఎన్యం పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. డాక్టర్ల కొరత కూడా తీవ్రంగానే ఉంది. దీంతో అటు డాక్టర్లు, ఇటు ఉద్యోగులు పనిభారం, మాన సిక ఒత్తిడి తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు.
వారి సేవలు మరువలేనివి
రోజురోజుకూ కరోనాకేసులు విపరీతంగా పెరిగిపోతు న్న నేపథ్యంలో వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బంది కరోనారోగుల కు అందిస్తున్న సేవలు ప్రశంసలు అందుకుంటున్నాయి. గత వారం రోజుల నుంచి జిల్లాలో ప్రతీరోజూ 500లకు తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం అంతటా ఆందోళనను రేకేత్తిస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. అయితే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది ఎలాంటి అదనపు సౌకర్యాలు లేకున్నా కరోనాపరీక్షలను నిర్వహిస్తూ తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆ తరువాత పాజిటివ్ వ చ్చిన రోగులకు కౌన్సిలింగ్ నిర్వహించి మనోధైర్యం కల్పించి మందులను అందిస్తున్నారు. కరోనాకారణంగా తీవ్ర అనారోగ్యం పాలవుతున్న వారందరికీ ఐసోలేషన్ సెంటర్లో జాయిన్ చేసి వారికి దగ్గరుండి మరీ సేవలు అందిస్తున్నారు. ప్రతిరోజూ వందల మందికి కరో నాపరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది పాజిటివ్ కేసులసంఖ్య పెరుగుతుండడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇటు కరోనా పరీక్షలు, అటు కరోనాపాజిటివ్ వచ్చిన వారికి వైద్యసేవ లు అందిస్తున్నారు. దీంతో పాటు ఉదయం 8గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు డ్యూటీలు నిర్వహించి కొవి డ్ టెస్టుల వివరాలతో పాటు వ్యాక్సినేషన్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అలాగే గ్రామాల విజిట్ లు, క్యాంపులు, ఎన్సీడీ సర్వేలు, సాధారణ ప్రసవాల కోసం ప్రచారం లాంటి విధులను సైతం నిర్వర్తించాల్సి వ స్తోంది. ముఖ్యంగా ఆదివారాల్లో కూడా వీరికి విధులు కేటాయిస్తుండడంతో కుటుంబసభ్యులకు గత ఏడాది కాలం నుంచి వీరు దగ్గర కాలేని పరిస్థితి నెలకొంటోందంటున్నారు.
అంతా ఔట్సోర్సింగే.....
వైద్య,ఆరోగ్యశాఖలో రెగ్యులర్ నియమకాలు లేని కారణంగా ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులతోనే పనులు వెల్లదీస్తున్నారు. కరోనా ఉదృతి నేపథ్యంలో కూడా రెగ్యూలర్ నియమకాలను భర్తీ చేయని కారణంగా ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులపై పనిభారం పెరిగిపోతోంది. ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగికి రూ. 12 నుంచి రూ. 15వేల వరకు వేతనం మాత్రమే చెల్లిస్తున్నారు. అతి తక్కువ వేతనానికి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహించాల్సి వస్తోంది. అయితే ప్రభుత్వం గత ఏడాది కాలం నుంచి వీరితో వెట్టి చాకిరి చేయించుకుంటున్నప్పటికి ఎలాంటి అలవెన్స్లు మంజూరు చేయకపోతుండడం విమర్శలకు తావిస్తోంది. గంప గుత్త వేతనంతో వీరు తమ విధులు నిర్వహిస్తూ వెట్టి చాకిరిని అనుభవిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. .
సెలవుల్లేవ్
అయితే గత మార్చి నెలలో మొదలైన కరోనావైరస్ వ్యాప్తి కారణంగా వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బందికి ఎలాంటి సెలవులను మంజూరు చేయడం లేదు. షిప్టుల వారీగా డ్యూటీలు కేటాయిస్తున్న అధికారులు సిబ్బంది కొరత కా రణంగా ఒక్కో ఔట్సోర్సింగ్ సిబ్బందికి రెండు షిప్టుల్లో డ్యూటీలు కేటాయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో వారు తీవ్రమైన పనిభారానికిలోనై మానసికంగా అలసిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యం పాలవుతున్న సంఘటనలున్నాయి. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తూ ఎదుటి వారి ఆరోగ్యాలను కాపాడడమే ధ్యేయంగా పెట్టుకుంటున్న ఈ ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఇప్పటికైనా సర్కారు చేయూతను అందించాలని కోరుతున్నారు. వీరందరిని రెగ్యులరైజ్ చేసి ఆదుకోవాలంటున్నారు.
అలవెన్స్లు ఇవ్వడం లేదు
ఈ విషయమై జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధన్రాజ్ను సంప్రదించగా వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బందికి ప్రత్యేకంగా అలవెన్స్లు ఇవ్వడం లేదని తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సిబ్బంది అహర్నిశలు ప్రజారోగ్య కోసం కృషి చేస్తున్నారని వివరించారు.
- ధన్రాజ్, జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి, నిర్మల్