Love పేరుతో ఇల్లొదిలి.. చివరకు భయపడి పోలీస్టేషన్‌ చేరి.. ఇవేం ట్విస్ట్‌లు బాబోయ్..!

ABN , First Publish Date - 2022-02-08T12:17:41+05:30 IST

ప్రేమ పేరుతో ఇల్లొదిలి పెట్టి.. చివరకు భయపడి పోలీస్టేషన్‌ చేరి..

Love పేరుతో ఇల్లొదిలి.. చివరకు భయపడి పోలీస్టేషన్‌ చేరి.. ఇవేం ట్విస్ట్‌లు బాబోయ్..!

చిత్తూరు జిల్లా/గంగవరం : ప్రేమ పేరుతో ఇల్లొదిలి పెట్టి.. చివరకు భయపడి పోలీస్టేషన్‌ చేరిన ఓ జంట తాలూకు ప్రేమాయణం పోలీసులకు పజిల్‌గా మారింది. పెద్దపంజాణి మండలానికి చెందిన ఓ బాలిక ఐదురోజుల క్రితం అదృశ్యమైంది. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా ఆమె గ్రామానికే చెందిన ఓ యువకుడితో వెళ్లినట్లు తేలింది. టవర్‌ లొకేషన్‌ ఆధారంగా ఆ యువకుడికి  ఫోన్‌ చేసి హెచ్చరించడంతో, భయపడి ప్రేమికులిద్దరూ గంగవరం పోలీస్‌స్టేషన్‌కు సోమవారం చేరుకున్నారు. 


వారిద్దరి పెద్దలను పిలిపించిన పోలీసులు విషయాన్ని వివరించారు. అయితే ఇరువర్గాల వారూ వింతవాదనలు వినిపిస్తూ పోలీసులకు చెమటలు పట్టించారు. అమ్మాయి.. వాడితో వెళ్లి పరువు తీసింది కాబట్టి వాళ్లతోనే పంపించేయండి అంటూ బాలిక తల్లిదండ్రులు, బాలికను తమతో తీసుకెళ్లబోమంటూ యువకుడి తరపువారు పట్టుబట్టారు. యువజంట కూడా తాము 5 రోజులు ప్రయాణం చేశామే కానీ పెళ్లి చేసుకోలేదని చెప్పారు.పైగా ఆ యువకుడు తనకు వద్దని బాలిక అంటుండగా, ఆమె కూడా తనకొద్దంటూ ఆ యువకుడు పట్టుబట్టాడు.


కులాల పట్టింపులకు తోడు పరువు పోయిందంటూ ఇరువర్గాల వారూ పంతానికి పోవడంతో సోమవారం రాత్రి 10 గంటలకు కూడా పోలీసులు ఏమీ తేల్చుకోలేకపోయారు. మరోపక్క బాలిక టీసీ ప్రకారం మైనర్‌ కాగా, ఆధార్‌ కార్డు ప్రకారం మేజర్‌గా ఉండడం ఇంకో తలనొప్పిగా మారింది. చివరకు బాలికను సోమవారం రాత్రికి మహిళా హాస్టల్‌లో ఆమె తల్లి సంరక్షణలో పెట్టి, మంగళవారం తహసీల్దార్‌ ఎదుట హాజరుపరచనున్నట్లు సీఐ రామకృష్ణమాచారి,ఎస్‌ఐ సుధాకర రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-02-08T12:17:41+05:30 IST