West Bengal : టీఎంసీ ఎమ్మెల్యే హత్యకు జైలు నుంచి కుట్ర... సూత్రధారి అరెస్టు...
ABN , First Publish Date - 2022-05-31T18:13:59+05:30 IST
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ ఎమ్మెల్యే పరేశ్ రామ్ దాస్ను
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ ఎమ్మెల్యే పరేశ్ రామ్ దాస్ను హత్య చేసేందుకు జైలు నుంచి కుట్ర పన్నిన చిరంజిత్ హల్దార్ వురపు చిరన్ను పోలీసులు అరెస్టు చేశారు. చిరన్ ఆరు నెలల క్రితం టీఎంసీ నేత కమల్ ముల్లిక్ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో చిరన్తోపాటు నలుగురిని కానింగ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరు జైలులో ఉన్నారు. ఇక్కడి నుంచే వీరు ఎమ్మెల్యేను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు కేసు నమోదైంది.
కానింగ్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పరేశ్ రామ్ దాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. చిరన్ జైలులో ఉన్నపుడు దాస్ హత్యకు కుట్ర పన్నినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం చిరన్ బెయిలుపై విడుదలయ్యారు. అనంతరం ఆయన బసంతి నుంచి మొనిరుల్ అనే యువకుడిని తీసుకెళ్ళారు. మొనిరుల్ ఇటీవల ఎమ్మెల్యే దాస్కు ఫోన్ చేసి, ‘‘నిన్ను చంపుతాం’’ అని హెచ్చరించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. నిందితులు బీజేపీ మద్దతుదారులని ఆరోపించారు. కానింగ్ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించి, ప్రధాన నిందితుడు చిరన్ను నరేంద్ర పూర్లో అరెస్టు చేశారు. ఆయనను మంగళవారం అలీపోర్ కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సునీప్ దాస్ మాట్లాడుతూ, టీఎంసీ నేతల మధ్య గ్రూపు తగాదాలు ఉన్నాయన్నారు. ఈ కేసుతో బీజేపీకి సంబంధం లేదన్నారు.