చింతామణి నాటకంపై ఏపీ High courలో విచారణ వాయిదా
ABN , First Publish Date - 2022-06-24T17:59:39+05:30 IST
చింతామణి నాటకంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం తిరస్కరించింది.
అమరావతి: చింతామణి నాటకం(chintamani drama)పై హైకోర్టు(High court)లో శుక్రవారం విచారణ జరిగింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం తిరస్కరించింది. చింతామణి నాటకానికి సంబంధించిన పుస్తకం తెలుగు, అనువదించిన ఇంగ్లీష్ కాపీని కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. చింతామణి నాటకం నిషేదిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓను సవాల్ చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆర్టిస్ట్లు పిటీషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. రఘురామకృష్ణరాజు తరపున ఉమేష్ చంద్ర, ఆర్టిస్ట్ల తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటీషన్లు వేశారు. పుస్తకాన్ని నిషేదించకుండా, నాటకాన్ని నిషేధించడమేమిటని న్యాయవాది ఉమేష్చంద్ర ప్రశ్నించారు. వాక్స్వాతంత్రాన్ని హరించడమేనంటూ వాదనలు వినిపించారు. కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే ప్రభుత్వం ఇటువంటి చర్యతీసుకుందని ఉమేష్ చెప్పారు.
అయితే రఘురామకృష్ణరాజుకు ఈ పిటీషన్ వేసేందుకు లోకల్ స్టాండ్ లేదని ఆర్యవైశ్య సంఘం తరపు న్యాయవాది వేదుల వెంకటరమణ వాదించారు. ప్రజా ప్రతినిధిగా, ఇటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసే హక్కు రఘురామకృష్ణరాజుకు ఉందని ఉమేష్చంద్ర తెలిపారు. శ్రవణ్ కుమార్ తరపున ఆయన జూనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఆర్టిస్ట్లు తమ జీవన హక్కును కోల్పోతున్నారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న హైకోర్టు చింతామణి నాటకం పుస్తకాన్ని తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ... విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది.