వివాహం చేసుకోవడం ఇష్టంలేక.. వివాహేతర సంబంధం వదులుకోలేక..
ABN , First Publish Date - 2020-09-16T18:09:08+05:30 IST
ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామ సమీపంలోని గాలేరు-నగరి కాల్వలో..
కడప(ఆంధ్రజ్యోతి): ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామ సమీపంలోని గాలేరు-నగరి కాల్వలో దూకి అనంతపురం జిల్లా మర్రికొమ్మదిన్నెకు చెందిన ఓ యువజంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాలను మంగళవారం జాలర్ల సహాయంతో పోలీసులు వెలికితీశారు. ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తెలిపారు. ఎస్ఐ శివప్రసాద్ సమాచారం మేరకు... అనంతపురం జిల్లాకు చెందిన పారి కార్తీక్(25) ఎన్పీ కుంట మండలం మర్రికొమ్మదిన్నెలో వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం పులివెందుల టౌన్లో నివాసం ఉంటున్నాడు.
అదే గ్రామానికి చెందిన వలంటీర్ పప్పిరెడ్డి కవితతో ఇతనికి వివాహేతర సంబంధం ఉంది. కాగా 8 సంవత్సరాల క్రితం కవితకు వివాహం అయింది. ప్రస్తుతం భర్త కువైత్లో ఉన్నాడు. కార్తీక్కు కుటుంబ సభ్యులు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే కార్తీక్ వివాహం చేసుకోవడం ఇష్టంలేక కవితను వదులుకోలేక ఇద్దరూ కలసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. సోమవారం ద్విచక్రవాహనంలో ముద్దనూరుకు చేరుకొని చిన్నదుద్యాల సమీపంలో విష ద్రావణం తాగారు. తాము చనిపోతున్నట్టు కుటుంబసభ్యులకు సమా చారం ఇచ్చారు.
అనంతరం కాల్వలోని నీటిలో దూకేశారు. కార్తీక్ తల్లి పారి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం సంఘటన స్థలం వద్దకు చేరుకుని జాలర్ల సాయంతో కాల్వలో వెతికి ఇద్దరి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.