చినజీయర్ మేడారం రావాలి: సీతక్క
ABN , First Publish Date - 2022-03-18T00:49:23+05:30 IST
సమ్మక్క, సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్ స్వామి మేడారం వచ్చి ఇక్కడ జరుగుతున్న చెడు ఏమిటో నిరూపించాలని ములుగు
మేడారం: సమ్మక్క, సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్ స్వామి మేడారం వచ్చి ఇక్కడ జరుగుతున్న చెడు ఏమిటో నిరూపించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. మేడారంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెలను ఎమ్మెల్యే గురువారం దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వనదేవతల ప్రతిష్టను మసకబార్చే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన మరుసటిరోజు నుంచే మేడారంలో మహాజాతర ప్రారంభమైందన్నారు. ముచ్చింతల్కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ రాలేకపోయారని విమర్శించారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మేడారానికి రాలేదని తప్పుబట్టారు. వారి వైఖరేమిటో అర్థం కావడంలేదన్నారు. కోట్లాది మంది పూజించే దేవతలంటే ఎందుకింత చులకన..? అని ప్రశ్నించారు. చినజీయర్ బేషరతుగా క్షమాపణ చెప్సాలిందేనని సీతక్క డిమాండ్ చేశారు.