చైనాలో కొత్త ప్రయోగం.. గురుత్వాకర్షణ శక్తి అదృశ్యం..!
ABN , First Publish Date - 2022-01-16T02:36:22+05:30 IST
చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించే ప్రయత్నంలో భాగంగా చైనా ఓ సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించే ప్రయత్నంలో భాగంగా చైనా ఓ సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా.. భూమిపై ఉన్న గురుత్వాకర్షణ అదృశ్యమైపోయిందా అనే రీతిలో సరికొత్త పరిస్థితులను సృష్టించింది. కేవలం 60 సెంటీమీటర్ల వైశాల్యం ఉండే చిన్న ఛాంబర్(గది)ని చైనా శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ గదికి కొన్న శక్తివంతమైన అయస్కాంతాలను అమర్చారు. వీటి ద్వారా గదిలో గురుత్వాకర్షణ శక్తిని చంద్రుడిపై సాధారణంగా కనిపించే స్థాయికి తగ్గించగలిగారు. భూమి అంతటా వ్యాపించిన గురుత్వాకర్షణ శక్తి ఈ గదిలో మాత్రం అదృశ్యమైపోయిందా అని అనిపించే స్థాయిలో అక్కడి శాస్త్రవేత్తలు చాంబర్లోని పరిస్థితులను నియంత్రించగలిగారు.
ఇది అసాధారణ ప్రయోగమని, చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించే ప్రయోగాలకు ఇది ఎంతో ఊతం ఇస్తుందనే అభిప్రాయం ప్రస్తుతం శాస్త్రజ్ఞుల్లో వినిపిస్తోంది. ఇప్పటివరకూ..భూమ్మీద గురుత్వాకర్షణ శక్తిని తప్పించుకునే అవకాశం లేకపోవడంతో వ్యోమగాములు వాతావరణ అంచులకు చేరుకోగలిగే ప్రత్యేకమైన విమానాల్లో శిక్షణ పొందుతున్న విషయం తెలిసిందే. తద్వారా.. వ్యోమగాములు చంద్రుడిపై ఉండే తక్కువస్థాయి గురుత్వాకర్షణ శక్తి గురించి అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు.