ఓ దశాబ్దం తర్వాత తొలిసారి టిబెట్‌లో పర్యటించిన జీ జిన్‌పింగ్

ABN , First Publish Date - 2021-07-24T01:10:00+05:30 IST

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అప్రకటితంగా టిబెట్ అటానమస్

ఓ దశాబ్దం తర్వాత తొలిసారి టిబెట్‌లో పర్యటించిన జీ జిన్‌పింగ్

న్యూఢిల్లీ : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అప్రకటితంగా టిబెట్ అటానమస్ రీజియన్‌లో పర్యటించారు. ఈ పర్యటన అరుణాచల్ ప్రదేశ్‌లోని భారత్-చైనా సరిహద్దులకు సమీపంలోని న్యింగ్చి నుంచి రెండు రోజుల క్రితం ప్రారంభమైందని చైనా అధికారిక మీడియా శుక్రవారం వెల్లడించింది. న్యింగ్చిలో బుధవారం పర్యటించారని, టిబెట్ రాజధాని లాసాలో గురువారం పర్యటించారని తెలిపింది. 


చైనా సామాజిక మాధ్యమాల్లో కనిపించిన వీడియోల ప్రకారం, జీ జిన్‌పింగ్ న్యింగ్చిలోని స్థానికులకు అభివాదం చేశారు. టిబెటన్‌లు అదృష్టానికి సంకేతంగా ఉపయోగించే ‘‘టషి డెలెక్’’ను ప్రదర్శించారు. అద్భుతమైన భవిష్యత్తు పట్ల నమ్మకం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. 


చైనా అధికారిక వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం న్యింగ్చిలో జిన్‌పింగ్‌కు ఘన స్వాగతం లభించింది. స్థానికులు, వివిధ వర్గాల ప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన యార్లుంగ్ జంగబో నదికి ఉప నది అయిన న్యాంగ్ నదిని సందర్శించి, యార్లుంగ్ జంగబో నది పరీవాహక ప్రాంతంలో పర్యావరణం గురించి ఆరా తీశారు. 


టిబెట్ శాంతియుత విముక్తి 60వ వార్షికోత్సవాల సందర్భంగా జీ జిన్‌పింగ్ 2011 జూలై 18న లాసాలో పర్యటించారు. అప్పట్లో ఆయన చైనా ఉపాధ్యక్షునిగా ఉండేవారు. 


Updated Date - 2021-07-24T01:10:00+05:30 IST