పాక్కు చైనా డ్రోన్ల సరఫరా! ఒక్కోదాంట్లో 12 క్షిపణులు!
ABN , First Publish Date - 2020-07-06T15:51:45+05:30 IST
పాకిస్థాన్కు నాలుగు ఎటాక్ డ్రోన్లు దాడి చేసే డ్రోన్లు సరఫరా చేసేందుకు చైనా సిద్ధమవుతోంది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్కు ఎటాక్ డ్రోన్లను(దాడి చేసే డ్రోన్లు) సరఫరా చేసేందుకు చైనా సిద్ధమవుతోంది. ఒక్కో డ్రోన్లో..నేలపై లక్ష్యాను ఛేదించగలిగిన 12 క్షిపణులను అమర్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్, గ్వదార్ పోర్టు భద్రత కోసమే వీటిని సరఫరా చేస్తున్నట్టు సమచారం. మొత్తం నాలుగు డ్రోన్లు, రెండు కమాండ్ సెంటర్లతో కూడిన రెండు వ్యవస్థలను చైనా పాక్కు సరఫరా చేయనుంది.
అయితే ఈ డ్రోన్ల పనితీరు అంతంత మాత్రమేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వీటిని యూఏఈ మద్దతు కలిగిన శక్తులు లిబియాలో వినియోగిస్తుండగా..ఆశించిన ఫలితాలు రావట్లేదని వినికిడి. గత రెండు నెలల్లోనే ఏకంగా నాలుగు చైనా డ్రోన్లు ప్రత్యర్థి వర్గాలు కూల్చేసాయట.
మరోవైపు..పాక్ భాగస్వామ్యంతో జీజే-2 ఎటాక్ డ్రోన్లను ఉత్పత్తి చేసేందుకు కూడా చైనా సిద్ధమవుతోంది. వింగ్ లూంగ్-2 అనే చైనా డ్రోన్కు అదనపు ప్రత్యేకతలను జోడించడం ద్వారా జీజే-2 రూపకల్పన జరిగింది. ఇరు దేశాల సంయుక్త భాగస్వామ్యంలో మొత్తం 48 జీజే-2లను నిర్మించాలని చైనా యోచిస్తోంది.
బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట చైనా వివిధ దేశాలను వాణిజ్య బంధంలో ఏకంగా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కమ్యునిస్టు దేశం ఇప్పటికే పాక్లో 60 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అనేక రోడ్లు, నౌకాశ్రయాల నిర్మాణం చేపడుతోంది. వీటి రక్షణ కోసం పాకిస్థాన్ను అవసరమైన ఆయుధ సంపత్తిని కూడా సరఫరా చేస్తోంది.