ఆఫ్ఘన్‌లో వీఘర్ ముస్లిం దాడితో చైనాకు వణుకు

ABN , First Publish Date - 2021-10-15T23:57:27+05:30 IST

వీఘర్ ముస్లింల కోసం పోరాడే సంస్థలను నిలువరిస్తామని

ఆఫ్ఘన్‌లో వీఘర్ ముస్లిం దాడితో చైనాకు వణుకు

వాషింగ్టన్ : వీఘర్ ముస్లింల కోసం పోరాడే సంస్థలను నిలువరిస్తామని ఇచ్చిన హామీని తాలిబన్లు నెరవేర్చడం లేదని చైనా ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. దీనికి కారణం గత శుక్రవారం ఆఫ్ఘనిస్థాన్‌లోని కుందుజ్‌లో ఓ మసీదు వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి వీఘర్ ముస్లిం కావడమే. దీంతో తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘన్‌లో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనపై చైనా పునఃసమీక్షిస్తున్నట్లు అమెరికన్ మీడియా తెలిపింది. 


అమెరికన్ మీడియాలో ప్రచురితమైన ఓ వ్యాసంలో తెలిపిన వివరాల ప్రకారం, వీఘర్ ముస్లింల సమస్యలపై పోరాడే సంస్థలను నిలువరిస్తామని తాలిబన్లు చైనాకు హామీ ఇచ్చారు. అయితే గత శుక్రవారం ఆఫ్ఘన్‌లోని కుందుజ్‌లో ఓ షియా మసీదు వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి వీఘర్ ముస్లిం అని తెలిసింది. ఈ దాడికి తమదే బాధ్యత అని ఆఫ్ఘన్‌లోని ఐఎస్ఐఎస్-కే అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పని చేస్తోంది. దీంతో తాలిబన్లు ఇచ్చిన హామీలకు ఉన్న విలువను చైనా జాతీయ భద్రతాధికారులు ప్రశ్నిస్తున్నారు. 


చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్‌లో వీఘర్ ముస్లింలు అధికంగా ఉంటారు. ఇంటా, బయటా హింసను అణచివేయాలన్న లక్ష్యంతో వీరిపై చైనా కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. కుందుజ్ దాడిని ఓ సూచనగా చైనా పెద్దలు భావిస్తున్నారు. వీఘర్ల కోసం పోరాడే సంస్థలకు ఆఫ్ఘనిస్థాన్ స్వర్గధామంగా మారకుండా నిరోధించడం సహా ఇతర హామీలను తాలిబన్లు నెరవేర్చడం లేదని ఆందోళన చెందుతున్నారు. తమ నుంచి ఎక్కువ పెట్టుబడులను రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ఆఫ్ఘనిస్థాన్‌లోని తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌తో ఎలా వ్యవహరించాలనే అంశంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఐఎస్ఐఎస్-కే ఉగ్రవాద సంస్థతో తాలిబన్లకు సంబంధాలు ఉన్నాయనే అనుమానం చైనా పెద్దలకు వచ్చింది. 


స్టిమ్సన్ సెంటర్‌లో చైనా ప్రోగ్రామ్ డైరెక్టర్ యున్ సున్ మాట్లాడుతూ, తాలిబన్లు ఆఫ్ఘన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత జరిగిన అతి పెద్ద దాడి ఇదే (కుందుజ్ మసీదుపై దాడి) అని చెప్తూ, ఓ వీఘర్ ముస్లిం ఈ దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. 


Updated Date - 2021-10-15T23:57:27+05:30 IST