చైనా అణచివేతపై వీఘర్స్, టిబెటన్లు, హాంగ్ కాంగర్లు, తైవానీల నిరసన గళం

ABN , First Publish Date - 2020-08-05T03:43:58+05:30 IST

చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీపీ) ఆగడాలపై నిరసన గళాలు పెరుగుతున్నాయి.

చైనా అణచివేతపై వీఘర్స్, టిబెటన్లు, హాంగ్ కాంగర్లు, తైవానీల నిరసన గళం

హాంగ్ కాంగ్ : చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీపీ) ఆగడాలపై నిరసన గళాలు పెరుగుతున్నాయి. ఇంత కాలం ఎదురు లేని రీతిలో వ్యవహరించిన సీపీపీకి నిరసనల సెగ తగులుతోంది. చైనాలోనూ, ఆ దేశ ఆక్రమిత భూభాగాల్లోనూ ఉన్న రాజకీయ ఉద్యమకారులు, నేతలు అణచివేతకు వ్యతిరేకంగా నిరసనల తీవ్రతను పెంచుతున్నారు. అక్టోబరు 1న చైనాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ నిరసన దినంగా నిర్వహించాలని నిర్ణయించారు. 


వీఘర్లు, టిబెటన్లు, హాంగ్ కాంగర్లు, తైవానీలు, దక్షిణ మంగోలియన్లు, చైనా ప్రజాస్వామిక ఉద్యమకారులు విడుదల చేసిన వీడియో సందేశంలో అక్టోబరు 1న చైనాకు వ్యతిరేకంగా ‘గ్లోబల్ డే ఆఫ్ యాక్షన్’గా నిర్వహిస్తామని తెలిపారు. 


చైనా ప్రజా గణతంత్ర దేశ వ్యవస్థాపక దినోత్సవం అక్టోబరు 1న జరుగుతుందన్న సంగతి తెలిసిందే. 


తైవాన్‌కు స్వేచ్ఛనివ్వాలనే నినాదంతో ఏర్పాటైన ‘కీప్ తైవాన్ ఫ్రీ’ సహ వ్యవస్థాపకురాలు జెన్నీ వాంగ్ మాట్లాడుతూ, చైనా కమ్యూనిస్టు పార్టీ అనుసరిస్తున్న వలసవాద, విస్తరణవాద, నియంతృత్వం వల్ల ప్రతి ఒక్కరూ బాధపడుతున్నట్లు తెలిపారు. చైనా బెదిరింపులతో అధికారం పొందుతోందన్నారు. ప్రభుత్వాలు, కార్పొరేషన్లు, అంతర్జాతీయ సంస్థలను బ్లాక్‌మెయిల్ చేస్తోందని, ఆర్థిక బలంతో విమర్శకుల నోళ్లు మూయిస్తోందని అన్నారు. 


వీఘర్ వరల్డ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ డోల్కున్ ఐసా మాట్లాడుతూ, చైనా, దాని ఆక్రమిత భూబాగాల్లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలను కోరే గళాలపై దాడులు తీవ్రమయ్యాయన్నారు. 


Updated Date - 2020-08-05T03:43:58+05:30 IST