తూర్పు లద్దాఖ్కు సమీపంలో 25 చైనా యుద్ధ విమానాలు..
ABN , First Publish Date - 2022-06-11T03:00:05+05:30 IST
భారత సరిహద్దు వెంబడి చైనా(China) మౌలిక సదుపాయాల ఏర్పాటు ఆందోళనకరమంటూ అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తత చేసిన నేపథ్యంలో చైనా దుందుడుకు వైఖరి బయటపడింది. తూర్పు
న్యూఢిల్లీ : భారత సరిహద్దు వెంబడి చైనా(China) మౌలిక సదుపాయాలు విస్తృతమవుతుండడం ఆందోళనకరమంటూ అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తత చేసిన రోజుల వ్యవధిలోనే మరోసారి చైనా దుందుడుకు వైఖరి బయటపడింది. తూర్పు లద్దాఖ్ సెక్టార్కు సమీపంలో ఉండే హోటన్ ఎయిర్ బేస్లో 25 ప్రధాన శ్రేణి యుద్ధ విమానాలను చైనీస్ ఎయిర్ఫోర్స్ మోహరించింది. ప్రభుత్వవర్గాల సమాచారం ప్రకారం.. హోటన్ ఎయిర్ బేస్లో 25 ప్రధాన శ్రేణి ఫైటర్ జెట్స్ని చైనీస్ ఎయిర్ఫోర్స్ సిద్ధంగా ఉంచింది. ఈ విమానాల్లో జే-11, జే-20 ఫైటర్లు వంటి అధునాతన జెట్స్ ఉన్నాయని సమాచారం. గతంలో ఇక్కడ మిగ్-21 శ్రేణి ఫైటర్లను తక్కువ సంఖ్యలో మాత్రమే ఉంచేవారు. కానీ ఇప్పుడు ఎక్కువ సామర్థ్యం కలిగిన అధునాతన విమానాలను పెద్ద సంఖ్యలో సిద్ధంగా ఉంచడం గమనార్హం. మరోవైపు భారతీయ భూభాగానికి సమీపంలో చైనా మిలిటరీ మరికొన్ని ఎయిర్ఫీల్డ్లను నిర్మిస్తోందని తేలింది. తక్కువ ఎత్తునుంచి ఆపరేషన్లు నిర్వహించగలిగేలా ఈ ఎయిర్ఫీల్డ్లను చైనా సిద్ధం చేస్తోంది.
రెచ్చగొట్టే వైఖరిని ప్రదర్శిస్తున్న వేళ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ఫోర్స్(పీఎల్ఏఏఎఫ్) కదలికలను భారత్ నిశితంగా గమనిస్తోంది. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలోని అరుణాచల్ ప్రదేశ్లో లద్దాఖ్ సరిహద్దు వెంట పరిస్థితులపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా చైనాలోని హోటన్తోపాటు గర్ గున్సా, కష్ఘర్, హొప్పింగ్, డొంకా గోంగ్, లింజీ, పంగత్ ఎయిర్బేస్లపై డేగ కన్నేసింది.