క్లారిటీ ఇవ్వని చైనా.. ఇబ్బందుల్లో భారతీయ విద్యార్థులు..!

ABN , First Publish Date - 2022-02-16T01:46:04+05:30 IST

విదేశీ విద్యార్థులకు వీసాలు జారీ చేసే విషయమై అందరినీ సమన్వయ పరుచుకుంటూ తగు చర్యలు తీసుకుంటామని చైనా మంగళవారం నాడు పేర్కొంది. అయితే.. ఈ ప్రక్రియ ఎప్పటికి మొదలవుతుందనే విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో అనేక మంది భారతీయ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. చైనాలో విద్యను అభ్యసిస్తున్న అనేక మంది..

క్లారిటీ ఇవ్వని చైనా.. ఇబ్బందుల్లో భారతీయ విద్యార్థులు..!

ఇంటర్నెట్ డెస్క్: విదేశీ విద్యార్థులకు వీసాలు జారీ చేసే విషయమై  అందరినీ సమన్వయ పరుచుకుంటూ తగు చర్యలు తీసుకుంటామని చైనా మంగళవారం నాడు పేర్కొంది. అయితే.. ఈ ప్రక్రియ ఎప్పటికి మొదలవుతుందనే విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో అనేక మంది భారతీయ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. చైనాలో విద్యను అభ్యసిస్తున్న అనేక మంది భారతీయులు వీసా రాని కారణంగా గత రెండేళ్లుగా స్వదేశంలోనే ఉండిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 23 వేల మంది భారతీయులు చైనా యూనివర్శిటీల్లో చదువుకుంటున్నట్టు సమాచారం. కొవిడ్ ఆంక్షలు విధించే క్రమంలో చైనా ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు వీసాల జారీ నిలిపివేసింది. దీంతో.. అక్కడి యూనివర్శిటీల్లో వైద్య విద్య చదువుకుంటోన్న భారతీయ విద్యార్థులు ఇక్కట్ల పాలవుతున్నారు. చైనా యూనివర్శిటీలు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నప్పటికీ తమకు అర్థం కావట్లేదని, ముఖ్యంగా లేబోరేటరీలోనే నేర్చుకోవాల్సిన నైపుణ్యాలకు దూరమవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఈ క్రమంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో విలేకరులు భారతీయ విద్యార్థుల ఇబ్బందుల గురించి చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావ్ లిజియన్‌తో ప్రస్తావించారు. అయితే.. జావ్ ఈ విషయంలో స్పష్టమైన సమాధానం మాత్రం ఇవ్వలేదు. విదేశీ విద్యార్థులను అనుమతించే విషయంలో కొవిడ్ ప్రొటోకాల్ ప్రకారం ఓ క్రమపద్ధతిని అనుసరిస్తున్నామంటూ పాత పల్లవినే వినిపించారు. ‘‘చైనాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు చైనా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. విదేశీ విద్యార్థులను చైనాలోకి అనుమతించే విషయంలో అందరినీ సమన్వయ పరుచుకుంటూ తగు ఏర్పాట్లు చేస్తున్నాం. ’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా.. గతవారం చైనా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌కూ చైనా ప్రభుత్వం ఇదే తరహా హామీ ఇచ్చింది. 28 వేల మంది చైనా విద్యార్థులను తిరిగి చైనాలోకి అనుమతించేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పింది. ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో కొవిడ్ పాలసీ ప్రకారం నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్పింది.  పాక్ ప్రధాని పర్యటన ముంగిపు సందర్భంగా ఈ మేరకు చైనా ప్రభుత్వం.. పాక్‌తో పాటూ ఓ సంయుక్త ప్రకటన కూడా విడుదల చేసింది. 


మంగోలియా, సింగపూర్ ప్రభుత్వాలకూ చైనా ప్రభుత్వం ఇదే తరహా హామీ ఇచ్చింది. చైన మెడికల్ యూనివర్శిటీల్లో చదువుతున్న తమ విద్యార్థులకు మళ్లీ చైనాకు వెళ్లేందుకు వీసాలు జారీ చేయాలంటూ ఇటీవలే శ్రీలంక ప్రభుత్వం చైనా విదేశాంగ శాఖ మంత్రిని అభ్యర్థించింది. అయితే.. విదేశీ విద్యార్థులు వీసాలకు సంబంధించి తగు ఏర్పాట్లు చేస్తున్నామంటూ చెబుతున్న చైనా.. ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందనే విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఇక 2020  నుంచి చైనా భారతీయ విద్యార్థులకు వీసాల జారీని నిలిపివేసింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు కూడా అందుబాటులో లేవు.

Updated Date - 2022-02-16T01:46:04+05:30 IST