భారత్‌పై చైనా మండిపాటు

ABN , First Publish Date - 2020-11-25T18:33:55+05:30 IST

చైనా యాప్‌లపై భారత దేశం కఠినంగా వ్యవహరిస్తుండటంతో

భారత్‌పై చైనా మండిపాటు

న్యూఢిల్లీ : చైనా యాప్‌లపై భారత దేశం కఠినంగా వ్యవహరిస్తుండటంతో డ్రాగన్ దేశం తీవ్ర అసహనానికి గురవుతోంది. భారత్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. యాప్‌లపై నిషేధం విధిస్తూ, దేశ భద్రత కోసమే ఈ చర్య తీసుకుంటున్నట్లు చెప్పడం ఓ సాకు మాత్రమేనని మండిపడింది. తన యాప్‌లను నిషేధించేందుకు ‘దేశ భద్రత’ సాకును పదే పదే భారత దేశం వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 


కేంద్ర ప్రభుత్వం మంగళవారం తాజాగా 43  మొబైల్ యాప్‌లను బ్లాక్ చేసింది. వీటిలో ఎక్కువగా చైనాకు చెందినవే ఉన్నాయి. వీటి కార్యకలాపాలు భారత దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు ప్రతికూలంగా ఉన్నట్లు తెలిపింది. భారత దేశ రక్షణ, భద్రత, ప్రజా శాంతికి విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. 


ఈ నేపథ్యంలో చైనా అధికార ప్రతినిథి జీ రోంగ్ మాట్లాడుతూ, చైనా నేపథ్యంగల మొబైల్ యాప్‌లను నిషేధించేందుకు భారత దేశం పదే పదే ‘దేశ భద్రత’ సాకును ఉపయోగించడాన్ని తాము గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అందరు మార్కెట్ ప్లేయర్లకు  న్యాయమైన, నిష్పాక్షిక, వివక్షరహిత వ్యాపార వాతావరణాన్ని భారత దేశం కల్పిస్తుందని, వివక్షపూరిత చర్యలను సరిదిద్దుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 


విదేశాల్లోని చైనా కంపెనీలు అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి పని చేయాలని, చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించాలని, ప్రజా శాంతి, ఉత్తమ నైతిక విలువలను పాటించాలని చైనా  కోరుకుంటున్నట్లు తెలిపారు. చైనా, భారత దేశం పరస్పరం ముప్పు కాదని, అభివృద్ధికి అవకాశాలు అని తెలిపారు. చర్చలు, సంభాషణల ద్వారా పరస్పర ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సంబంధాలను తిరిగి సరైన మార్గంలోకి తీసుకురావాలన్నారు. 


వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లడఖ్‌లో చైనా సైన్యం ఉద్రిక్త వాతావరణం సృష్టించినప్పటి నుంచి భారత్‌, చైనా మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపథ్యంలో మన దేశ, ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న మొబైల్ యాప్‌లను గుర్తించి, కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 220 యాప్‌లపై నిషేధం విధించింది. 


Updated Date - 2020-11-25T18:33:55+05:30 IST