నాడు తల్లి.. నేడు తండ్రి మృతి...

ABN , First Publish Date - 2021-06-15T04:54:08+05:30 IST

నాడు తల్లి.. నేడు తండ్రి మృతి...

నాడు తల్లి.. నేడు తండ్రి మృతి...
తల్లిదండ్రుల మృతితో అనాథలైన యువరాజు, ఐశ్వర్య

అనాథలైన అన్నాచెల్లెలు

నర్సంపేట టౌన్‌, జూన్‌ 14 : రెక్కాడితే డొక్కాడని నిరుపేద కుటుంబం... పూరిగుడిసెలో నివాసం... కొన్నేళ్ల క్రితం ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యం పాలై తల్లి మృతి చెందగా, తండ్రి  రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. దీంతో వారి పిల్లులు  అనాథలుగా మారారు. వివరాల్లోకి వెళితే.

నర్సంపేట మండలం లక్నేపల్లికి చెందిన సింగవరపు రమేష్‌(44) భార్య రజిత 11 ఏళ్ల క్రితం ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యానికి  గురై మృతి చెందింది. నాటి నుంచి కుమారుడు యువరాజు, కూతురు ఐశ్వర్యలను కూలీనాలీ చేసుకుంటూ పోషించుకుంటున్నాడు. 

ఇటీవల రమేష్‌ సైకిల్‌పై లక్నేపల్లిలో రోడ్డుపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో ఎంజీఎంకు తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. తల్లిదండ్రుల మృతితో దిక్కుతోచని స్థితిలో అన్నాచెల్లెలు రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. తండ్రి దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో గ్రామస్థుల సహకారంతో సోమవారం దహన సంస్కారాలు నిర్వహించారు. తల్లిదండ్రుల మృతితో అనాధలై యువరాజు, ఐశ్వర్యలను రాష్ట్ర ప్రభుత్వం, ధాతలు ఆదుకోవడానికి ముందుకు  రావాలని గ్రామసర్పంచ్‌ గొడిశాల రాంబాబు, గ్రామస్థులు షేక్‌  రఫీసాబ్‌, బారపాక  మొగిలి, మంద అశోక్‌, నమిండ్ల స్వామి కోరుతున్నారు.

Updated Date - 2021-06-15T04:54:08+05:30 IST