అతితీవ్ర పోషకాహార లోపమున్న చిన్నారులను ఎన్ఆర్సీపీకి రెఫర్ చేయాలి
ABN , First Publish Date - 2021-07-31T04:58:39+05:30 IST
అతితీవ్ర పోషకాహార లోపమున్న చిన్నారులను ఎన్ఆర్సీపీకి రెఫర్ చేయాలి
- అంగన్వాడీ టీచర్లకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి ఆదేశాలు
- తాండూరు క్లస్టర్ పరిధిలో 580మంది చిన్నారుల గుర్తింపు
తాండూరు రూరల్: తాండూరు ఐసీడీఎస్ క్లస్టర్ పరిధిలోని ఆయా గ్రామాల్లో అంగన్వాడీ పరిధిలోకి వచ్చే అతితీవ్ర పోషక లోపంతో బాధపడుతున్న చిన్నారులను వెంటనే ఎన్ఆర్సీపీకి రెఫర్ చేయాలని జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారి లలితకుమారి అంగన్వాడీ టీచర్లనుఆదేశించారు. శుక్రవారం తాండూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 279మంది అంగన్వాడీ టీచర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల్లో తీవ్రత, అతితీవ్రత పౌష్టికాహార లోపం, అంగన్వాడీ కేంద్రాల పనితీరు వంటి విషయాలపై చర్చించారు. తాండూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 279అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వాటిలో 11మంది అంగన్వాడీ టీచర్లు వివిధ కారణాల వలన కేంద్రాలకు రాలేకపోయారని తాండూరు సీడీపీవో రేణుక క్లుప్తంగా వివరించారు. గత ఏప్రిల్ నెలలో తాండూరు క్లస్టర్ పరిధిలో 208, మే నెలలో 180, జూన్ నెలలో 192 మంది చిన్నారులు అతి తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తమకు నివేదికలు అందినట్లు సీడీపీవో రేణుక సమావేశంలో వివరించారు. అయితే రోజూ కేంద్రాలను పర్యవేక్షించాలని సీడీపీవోను లలితకుమారి ఆదేశించారు. అతితీవ్ర పోషకాహార లోపం ఉన్న చిన్నారులను వెంటనే ఎన్ఆర్సీపీకి రెఫర్ చేసేలా ప్రతి అంగన్వాడీ టీచర్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా చిన్నారుల తల్లిదండ్రులకు పోషకాహార లోపం గురించి వివరించాలని సూచించారు. చిన్నారులు సాధారణ స్థితికి వచ్చేలా ఎన్ఆర్సీపీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సూపర్వైజర్లు నిర్మల, అరుణ, దశమ్మ, నర్సమ్మ, యాదమ్మ, సీనియర్ అసిస్టెంట్ సంగమేశ్వర్ పాల్గొన్నారు.