ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చదివించాలి
ABN , First Publish Date - 2022-05-18T05:14:23+05:30 IST
అధికారులు, ప్రజాప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు
చేగుంట, మే 17: అధికారులు, ప్రజాప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని పేర్కొన్నారు. చేగుంట మండలం రెడ్డిపల్లి, వడియారం ప్రాథమిక పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద అభివృద్ధి పనులకు జడ్పీ చైర్పర్సన్ హేమలతశేఖర్గౌడ్, ఎమ్మెల్సీలు ఫారుక్హుస్సేన్, యాదవరెడ్డితో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. చేగుంటలో 63 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వడియారం పాఠశాలకు రూ.28 లక్షలు, రెడ్డిపల్లి పాఠశాలకు రూ.25 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని విద్యాధికారులకు, ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో డీఈవో రమేష్, ఎంఈవో బుచ్చనాయక్, ఎంపీడీవో ఉమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్బాబు, జడ్పీటీసీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రామచంద్రం, సొసైటీ చైర్మన్ పరమేష్ పాల్గొన్నారు.