చిన్నారులకు సంప్రదాయాలను నేర్పాలి

ABN , First Publish Date - 2022-05-17T06:39:13+05:30 IST

తల్లిదండ్రులు తమ బిడ్డలకు బాల్యం నుంచే సంస్కృతి, సంప్రదాయాలను నేర్పాలని ప్రముఖ ఆధ్యాత్మిక గాయకురాలు కొండవీటి జ్యోతిర్మయి సూచించారు.

చిన్నారులకు సంప్రదాయాలను నేర్పాలి
అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తున్న కొండవీటి జ్యోతిర్మయి

ఆధ్యాత్మిక గాయకురాలు కొండవీటి జ్యోతిర్మయి

అనంతపురం కల్చరల్‌, మే 16: తల్లిదండ్రులు తమ బిడ్డలకు బాల్యం నుంచే సంస్కృతి, సంప్రదాయాలను నేర్పాలని ప్రముఖ ఆధ్యాత్మిక గాయకురాలు కొండవీటి జ్యోతిర్మయి సూచించారు. సంస్కార భారతి, అనంత నాగ్‌ సంగీత కల్చరల్‌ కమిటీ సంయుక్తంగా కృష్ణ కళామందిర్‌లో అన్నమయ్య జయంతి ఉత్సవాలను సోమవారం నిర్వహించాయి. సంస్కార భారతి అధ్యక్షుడు కరణం వెంకటప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ హనుమంతు, సీడబ్ల్యూసీ చైర్‌ పర్సన రామలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండవీటి జ్యోతిర్మయి మాట్లాడుతూ, హిందూ సమాజానికి అన్నమయ్య కీర్తనలు తరగని సంపద అని అన్నారు. విద్యార్థి దశనుంచే చిన్నారులకు సంగీతాన్ని నేర్పాలని, తద్వారా వారికి మానసిక పరిపక్వత కలుగుతుందని అన్నారు. కాలం ఎన్ని కొత్తపుంతలు తొక్కుతున్నా, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తుండడం ఆనందదాయకమని ఏఎస్పీ హనుమంతు అన్నారు. అనంతరం జ్యోతిర్మయి అన్నమయ్య కీర్తనలతో సభికులను భక్తిసాగరంలో ముంచెత్తారు. శ్రీనృత్య కళానిలయం చిన్నారులు సంప్రదాయ నృత్యాలతో అలరించారు. కార్యక్రమంలో సంస్కార భారతి జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి, ఎస్కేయూ ప్రొఫెసర్‌ సుధాకర్‌బాబు, ఆచార్య మురళీకృష్ణ, నాట్యాచార్యురాలు సంధ్యామూర్తి, సాయి ట్రస్టు అధ్యక్షుడు విజయసాయికుమార్‌, జగర్లపూడి శ్యామసుందరశాసి్త్ర, రియాజుద్దీన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T06:39:13+05:30 IST