తెల్లవారితే జన్మదినం.. అంతలోనే మరణం
ABN , First Publish Date - 2022-06-26T06:36:05+05:30 IST
చిట్టిపొట్టి మాటలు.. తప్పటడుగులతో సందడి చేసిన ఆ చిన్నారి చిరునవ్వులు మూగబోయాయి. ఆరుబయట పిల్లలతో ఆడుకుంటున్న చిన్నారిని మురుగునీటి సంపు మింగేసింది.
మురుగునీటి సంపులో పడి చిన్నారి మృతి
ఎల్లారెడ్డిపేట, జూన్ 25: చిట్టిపొట్టి మాటలు.. తప్పటడుగులతో సందడి చేసిన ఆ చిన్నారి చిరునవ్వులు మూగబోయాయి. ఆరుబయట పిల్లలతో ఆడుకుంటున్న చిన్నారిని మురుగునీటి సంపు మింగేసింది. తెల్లారితే జన్మదిన వేడుకలకు సిద్ధమవుతున్న తల్లిదండ్రుల సంతోషాన్ని ఆవిరి చేసింది. కన్నవారికి పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లోని డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయంలో ఇమ్మడిశెట్టి మహి(3) శనివారం ప్రమాదవశాత్తు మురుగు నీటి సంపులో పడి మృతి చెందింది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం మేరకు.. గ్రామంలోని డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఇమ్మడిశెట్టి మంజుల- వెంకటేశ్ దంపతులు ఇద్దరు పిల్లలు సాహిత, మహీతో కలిసి ఉంటున్నారు. కూలీ పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తున్నారు. ఆరు బయట పిల్లలతో కలిసి ఆడుకుంటున్న చిన్నారి మిహీ సమీపంలోని మురుగు నీటి సంపుపై మూత లేకపోవడంతో అందులో ప్రమాదవశాత్తు పడిపోయింది. కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, కాలనీవాసులు చుట్టు పక్కల గాలించారు. సమీపంలోని మురుగు నీటి సంపులో పాప శవమై కనిపించింది. కన్నకూతురు పుట్టిన రోజు వేడుకలను సిద్ధమవుతున్న క్రమంలో చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసెలా రోధించారు. మృతురాలి తండ్రి వెంకటేశ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ వివరించారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే పాప ప్రాణం పోయింది
గ్రామంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయంలో మురుగు నీటి సంపు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పైకప్పు మూత సరిగా బిగించకపోవడంతోనే పాప ప్రాణం పోయిందని తల్లిదండ్రులు, కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపును నిర్మించి మూత బిగించకపోవడంతో చిన్నారి మహీ మృతి చెందిందని వాపోయారు. సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.