వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. బంధువులను తీసుకొచ్చి పంచాయితీ పెట్టిందని..
ABN , First Publish Date - 2020-10-21T14:20:26+05:30 IST
వివాహేతర సంబంధం నేపథ్యంలో పట్టణంలోని..
చిలకలూరిపేట(గుంటూరు): వివాహేతర సంబంధం నేపథ్యంలో పట్టణంలోని గాంధీపేటలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సమీపంలోని ఓ యువకుడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్ఐ షఫి తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట మండలం మద్దిరాలకు చెందిన నాంపల్లి మస్తానయ్య(38) టైలర్గా పనిచేస్తుంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మస్తానయ్య గతంలో కుటుంబంతో కలసి పిడుగురాళ్ల వద్ద కొండమోడులో నివాసం ఉన్నాడు. అక్కడ ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. మస్తానయ్య వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ మరో వ్యక్తితో ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న మస్తానయ్య స్వగ్రామానికి వచ్చి ఇక్కడే భార్య, పిల్లలతో ఉంటున్నాడు.
ఇటీవల అక్రమ సంబంధం నెరపిన సదరు మహిళ తన బంధువులతో మద్దిరాల వచ్చి తనకు రూ.5లక్షలు ఇవ్వాలని పంచాయితీ పెట్టింది. పెద్దమనుషుల సమక్షంలో రూ.50వేలు ఇస్తానని మస్తానయ్య ఒప్పుకున్నాడు. తనను నగదు కోసం డిమాండ్ చేయడంతో మనస్తాపానికి గురైన మస్తానయ్య మంగళవారం ఉదయం తాను టైలరింగ్ నిర్వహిస్తున్న దుకాణం వద్దకు వచ్చి కుటుంబ సభ్యులకు తాను చనిపోతున్నానని వీడియో సందేశం పంపాడు. అయితే అతని కుటుంబ సభ్యులు దుకాణం వద్దకు చేరుకునేలోపే మస్తానయ్య ఉరివేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న అర్బన్ ఎస్ఐ షఫి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.