అమిత్‌షాతోభేటీ లేకుండానే...

ABN , First Publish Date - 2022-01-05T08:15:10+05:30 IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ లేకుండానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వెనుదిరిగారు. ఆయన ఢిల్లీకి రాకముందు గత రెండు, మూడు రోజుల నుంచే ప్రధాని నరేంద్రమోదీ,

అమిత్‌షాతోభేటీ లేకుండానే...

  • ఢిల్లీలో ఉన్న రెండు రోజులూ కలిసే యత్నం
  • అపాయింట్‌మెంట్‌ దొరుకుతుందనే ఆశతో
  • మధ్యాహ్నం 3 గంటల వరకు ఎదురుచూపులు
  • చివరికి వెనుతిరిగిన ముఖ్యమంత్రి జగన్‌


న్యూఢిల్లీ, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ లేకుండానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వెనుదిరిగారు. ఆయన ఢిల్లీకి రాకముందు గత రెండు, మూడు రోజుల నుంచే ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షాలతో భేటీ కావడానికి అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంటు సోమవారం 4గంటలకు లభించింది. కానీ అమిత్‌షా సమయం కేటాయించలేదు. మోదీని కలిసిన తర్వాత సోమవారం రాత్రంతా అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోసం విఫల ప్రయత్నం చేశారు.


మంగళవారమైనా కలుస్తారేమోననే ఆశతో మధ్యాహ్నం మూడుగంటల వరకు ఎదురు చూసారు. అయినా, అమిత్‌షా కార్యాలయం నుంచి ఎలాంటి  సానుకూల సంకేతాలూ రాలేదు. దీంతో సాయంత్రం 4గంటలకు బయలు దేరాల్సిన సీఎం... మూడింటికే తన అధికార నివాసం 1-జన్‌పథ్‌ నుంచి బయలుదేరి విజయవాడకు వచ్చేశారు. ప్రధానితో తన వ్యక్తిగత ఇబ్బందులను ఏకరువు పెట్టుకున్నట్టే, అమిత్‌షాతో కూడా చెప్పుకోవాలని జగన్‌ ఆశపడినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, అమిత్‌షాను కలవడానికి అపాయింట్‌మెంటే కోరలేదని ఒక ఉన్నతాధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. తొలుత కలవాలని భావించినప్పటికీ, ప్రధానితో భేటీ అయినందువల్ల ఇక అమిత్‌షాను కలవనవసరంలేదని సీఎం భావించినట్లు ఆ అధికారి వివరించారు. 

Updated Date - 2022-01-05T08:15:10+05:30 IST