దేశాన్ని గాడిలో పెడతా

ABN , First Publish Date - 2022-02-24T07:53:00+05:30 IST

దేశం దారి తప్పుతోందని, దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోందని, జుగుప్సాకర, అసహ్యకరమైన పనులు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశానికి మంచిదికాదని, ఈ మత కల్లోల క్యాన్సర్‌ను నలిపి పారెయ్యాల్సిన అవసరం ఉందని అన్నారు.

దేశాన్ని  గాడిలో పెడతా

  • చివరి రక్తపుబొట్టు వరకు పోరాడతా..
  • మతకల్లోల, అసహ్య రాజకీయాల్ని తరిమేస్తా
  • కేంద్రంలో ధర్మ ప్రభుత్వం ఉండాలి
  • ఆనాడు ఒక్కడినే పిడికెడు మందితో బయల్దేరా
  • రాష్ట్రాన్ని తెచ్చి.. అద్భుత తెలంగాణను సాధించా
  • కుక్కలు మొరిగాయని ప్రయాణాన్ని ఆపబోం
  • మల్లన్నసాగర్‌.. తెలంగాణ జనహృదయ సాగర్‌
  • నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివి
  • ఇంజనీర్లు, కార్మికులకు నమస్కారాలు
  • ఇకపై దేశమంతా కరువున్నా మనకు ఉండదు
  • హరీశ్‌ కడుపు కట్టుకుని శ్రమించాడు: కేసీఆర్‌
  • మల్లన్నసాగర్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి
  • ఉత్సవమూర్తులకు సీఎం పూజలు
  • జలాలకు శాస్ర్తోక్త సారె

సిద్దిపేట, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): దేశం దారి తప్పుతోందని, దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోందని, జుగుప్సాకర, అసహ్యకరమైన పనులు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశానికి మంచిదికాదని, ఈ మత కల్లోల క్యాన్సర్‌ను నలిపి పారెయ్యాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్రంలో ధర్మంతో పనిచేసే ప్రభుత్వం ఉండాలన్నారు. జాతీయ రాజకీయాలను తాను ప్రభావితం చేస్తానని, దేశాన్ని రుజుమార్గంలో పెడతానని ప్రకటించారు. తన చివరి రక్తపుబొట్టు వరకు పోరాడతానని, దేశాన్ని సెట్‌రైట్‌ చేస్తానని ఉద్ఘాటించారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మించిన కొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను బుధవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. పంపుహౌజ్‌లో మోటార్లు ఆన్‌చేసి, డెలివరీ సిస్టర్న్‌ వద్ద ఎత్తిపోస్తున్న గోదావరి నీటికి శాస్త్రోక్తంగా సారె సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సిద్దిపేట జిల్లా ప్రజాప్రతినిధుల సభలో ప్రసంగించారు. కేసీఆర్‌ మాట్లాడుతూ, ‘‘ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్కడినే పిడికెడు మందితో బయల్దేరాను.


రాష్ట్రాన్ని తేవడమే కాదు.. అద్భుతమైన, అబ్బురపడే తెలంగాణను సాధించాను. దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ అవతరించింది. కుక్కలు మొరిగినంత మాత్రాన మా ప్రయాణాన్ని ఆపుతామా? పిచ్చివెధవల మాటలు మేం పట్టించుకోం. ఈరోజు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు కూడా మనవైపు చూస్తున్నాయి. పంజాబ్‌తో పోటీ పడి వరిసాగులో ముందుకెళ్లాం. తెలంగాణను అన్ని రంగాల్లో ముందు నిలిపాం. ఉచిత కరెంటును ఉత్తగనే తీసుకురాలేదు. నా పొలం ఈ మల్లన్నసాగర్‌కు 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటది. నీళ్లు లేక కరువుతో చాలా ఇబ్బంది పడ్డాను. నా లెక్కనే తెలంగాణ అంతటా రైతులు కరువు ఎదుర్కొన్నారు. అందరి బాధలు తీర్చడానికే ఉచిత కరెంటు, కాళేశ్వరం, రైతుబంధు లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చిన. ఇప్పుడు భారతదేశమంతటా కరువు వచ్చినా మన తెలంగాణలో కరువు ఉండదు. ఏప్రిల్‌లో కూడా అన్ని చెరువుల్లో నీళ్లు ఉంటాయి. గొంతులు తడారిన నేల ఇది. ఈ గోస తీర్చడానికే మల్లన్నసాగర్‌ కట్టుకున్నం. నిర్వాసితులకు చరిత్రలో ఎన్నడూ ఇవ్వని విధంగా పరిహారం ఇచ్చాం. ఇంకా ఎవరైనా మిగిలితే వాళ్లకు కూడా ఇవ్వండి. మరో రూ.100కోట్లు ఎక్కువైతయి. నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది. అందుకే ఎక్కడా లేనివిధంగా పునరావాస కాలనీలు కట్టించా. 


అడ్డుకునేందుకు 600 కేసులు వేశారు

మల్లన్నసాగర్‌ తెలంగాణ జనహృదయ సాగర్‌. ప్రాజెక్టు కడుతున్న సందర్భంలో ఒక దుర్మార్గుడు హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. వెంటనే హైకోర్టు సీజేకు ఫోన్‌ చేసి ప్రాజెక్టు విశిష్టత గురించి చెప్పాను. వారు ప్రభుత్వం తరఫున వివరాలు సమర్పించాలని కోరారు. ఇలా వివిధ సందర్భాల్లో 600 కేసుల దాకా వేశారు. రాజకీయాలు చేశారు. అనేక ఆటంకాలు సృష్టించారు. కానీ, ఆ కొమురెల్లి మల్లన్న దయతో నిర్విఘ్నంగా రిజర్వాయర్‌ను పూర్తి చేశాం. తెలంగాణ ఇంజనీర్ల కృషి అద్భుతం. కాళేశ్వరం ప్రాజెక్టులో 14 రాష్ట్రాలకు చెందిన 58 వేల మంది కార్మికులు ఏకకాలంలో పని చేశారు. వీరందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కొందరు ఇంజనీర్లపై కేసులు కూడా పెట్టారు. అయినా వెరవకుండా పనిచేశారు. ప్రసుతం మల్లన్నసాగర్‌లో 10.64 టీఎంసీల నీళ్లున్నాయి. ఇప్పుడు 6 టీఎంసీల నీళ్లు నింపుతారు. మరో 15 టీఎంసీల నీటిని వానాకాలంలో నింపుతారు. ప్రాజెక్టులపై అవగాహన లేని కొందరు సోషల్‌ మీడియాలో ఇష్టంవచ్చిన పోస్టులు పెట్టి మిడ్‌మానేరును బద్నాం చేశారు. జాలువారుతుందని దుష్ప్రచారం చేశారు. కానీ, కొత్త ప్రాజెక్టులకు జాలు రావడం కామన్‌ పాయింట్‌. దీనిని ఎత్తిపోయడానికి అన్ని రిజర్వాయర్ల వద్ద బోర్లు కూడా ఏర్పాటు చేస్తారు. లోపాలుంటే ఇంజనీర్లే గుర్తిస్తారు. 


హాలీవుడ్‌ సినిమాల షూటింగ్‌లు జరిగేలా..

50 టీఎంసీల సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ మధ్యలో 600 ఎకరాల ఐలాండ్‌ ఉంటుంది. చుట్టూ నీళ్లు.. మధ్యలో గుట్టలతో ఈ ప్రాంతం ఆకర్షణీయంగా మారుతుంది. హాలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాల షూటింగ్‌లన్నీ ఇక్కడ జరిగేలా పోటీ పడతాయి. అరోమాటిక్‌ ప్లాంట్స్‌ను పెద్ద సంఖ్యలో నాటుతున్నారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు సమీపంలోనే ఉంది. అక్కడి నుంచి రెండు ఫోర్‌ లేన్‌ రహదారులను ఈ రిజర్వాయర్‌ వద్దకు నిర్మిస్తాం. నీటిపారుదల శాఖకు సంబంధించిన మీటింగులు జరిగేలా రూ.100 కోట్లతో ఇరిగేషన్‌ కాంప్లెక్స్‌ ఇక్కడే కట్టాలి. దుబాయ్‌ బుర్జ్‌ ఖలీఫా టవర్లను తలపించేలా ఇక్కడ టవర్లు నిర్మించాలి. సింగపూర్‌ నుంచి పర్యాటకులు మల్లన్నసాగర్‌కు తరలి వచ్చేలా ఆకర్షించాలి. హరీశ్‌రావు తన టాలెంట్‌, శక్తియుక్తులను వినియోగించి ఏడాదిన్నరలో వీటిని పూర్తి చేయించాలి. ఫస్ట్‌ టర్మ్‌లో హరీశ్‌ ఇరిగేషన్‌ మంత్రిగా ఉన్నడు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిండు. ఎన్ని సవాళ్లు ఎదురైనా నిబద్ధతతో కృషి చేసిండు. పనులు త్వరగా పూర్తయ్యేలా కాంట్రాక్టర్లను ప్రొత్సహించిండు. కడుపు కట్టుకొని కష్టపడ్డాడు.


మల్లన్నసాగర్‌తోపాటు కొండపోచమ్మ సాగర్‌, బస్వాపూర్‌, వన దుర్గామాత ప్రాజెక్టు, రంగనాయక సాగర్‌, అనంతగిరి రిజర్వాయర్ల వద్ద పర్యాటక అభివృద్ధికి రూ.1500 కోట్లు కేటాయిస్తున్నాం. వాటర్‌ టూరిజానికి మల్లన్నసాగర్‌ను కేంద్రంగా మార్చాలి. పాలమూరు జిల్లాలో 70 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లను త్వరలో ప్రారంభించుకుంటాం. పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ప్రాజెక్టు తుదిదశకు చేరింది. ఉద్యమంపై నీళ్లు చల్లేలా నక్కజిత్తుల చంద్రబాబు తెచ్చిన ప్రాజెక్టు దేవాదుల. ఈ ప్రాజెక్టుకు మేము సమ్మక్క-సారక్క  పేరు పెట్టి పూర్తి చేస్తున్నాం’’ అని అన్నారు. 


నా జన్మ ధన్యమయింది: హరీశ్‌రావు

ఒకప్పుడు తెలంగాణలో వానాకాలంలో కూడా కరువు పరిస్థితులు ఉండేవని, ఎండాకాలం వలె కనిపించేదని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. కానీ, నేడు ఎండాకాలంలో కూడా వానాకాలంలాగే ఉందని, ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితమేనని అన్నారు. గత వేసవిలో మల్లన్నసాగర్‌ ట్రయల్‌ రన్‌ ద్వారా వచ్చిన నీళ్లతోనే ఈ ప్రాంతమంతా సస్యశామలం అయిందని, ఇప్పుడు రిజర్వాయర్‌ పూర్తిగా నిండితే సిరుల పంటలు పండుతాయని తెలిపారు. నదికే కొత్త నడక నేర్పించి 557 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్‌ను నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ఈ మహోత్తర ఘట్టంలో పాల్గొన్నందుకు తన జన్మధన్యమైందన్నారు. 


బెంగళూరులో మత కల్లోలం

ఠి‘‘ఈ మధ్యే ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు అనుకోకుండా కలిశారు. వాళ్ల అమ్మాయిలు బెంగళూరులో చదువుకుంటున్నారట. ఈ దిక్కుమాలిన మత కల్లోలం కారణంగా ఇంటికి వచ్చారు. బెంగళూరు సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా వర్థిల్లుతున్నది. అక్కడ రూ.3 లక్షల కోట్ల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు ఉంటే మన హైదరాబాద్‌లో ఏటా రూ.లక్షన్నర కోట్ల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులున్నాయి. మన శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు ఇప్పుడు దేశంలోనే నాలుగోస్థానంలో ఉంది. మన హైదరాబాద్‌లో కూడా మత కల్లోలాలు ఉంటే ఐటీ కంపెనీలు వస్తాయా? ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని కేసీఆర్‌ అన్నారు. 




స్విచ్‌ ఆన్‌ చేసి మోటార్లను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌


మల్లన్నను స్మరిస్తూ.. మల్లన్నసాగర్‌ ప్రారంభం

సిద్దిపేట/చేర్యాల, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కొమురవెల్లి మల్లిఖార్జున స్వామిని స్మరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం కొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి తుక్కాపూర్‌ చేరుకున్న ముఖ్యమంత్రి.. అక్కడి నుంచి నేరుగా పంపుహౌజ్‌ వద్దకు చేరుకున్నారు. అనంతరం 1.25 గంటలకు మోటారును సీఎం ఆన్‌ చేశారు. 1.35 గంటలకు కట్టపైకి చేరుకుని డెలివరీ సిస్టర్న్‌ వద్ద రిజర్వాయర్‌లో దుంకుతున్న జలాలకు పూజలు చేశారు.  శాస్ర్తోక్తమైన సారెను సమర్పించారు.  అనంతరం ప్రజాప్రతినిధుల సభకు చేరుకుని ప్రసంగించారు. తరువాత గోదావరి జలాలతో కొమురవెల్లి మల్లిఖార్జునస్వామి ఆలయానికి వెళ్లారు. గోదావరి నీటితో స్వామివారి పాదాలకు అభిషేకం చేశారు. కాగా, తన పురిటిగడ్డ అయిన సిద్దిపేట జిల్లాలో భారీ రిజర్వాయర్‌ను నిర్మించిన నేపథ్యంలో తుక్కాపూర్‌లో హెలికాప్టర్‌ దిగినప్పటి నుంచి పర్యటన ముగిసే వరకు కేసీఆర్‌ ఆనంద పరవశంతో ఉన్నారు. 



మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌లోకి దూకుతున్న గోదావరి జలాలు



మల్లన్న ఆలయంలో పూజలు చేస్తున్న సీఎం కేసీఆర్‌


మల్లన్నకు అభిషేకం నిర్వహించేందుకు గోదావరి జలాలను తీసుకొస్తున్న కేసీఆర్‌

Updated Date - 2022-02-24T07:53:00+05:30 IST