ఆ కేసులన్నీ బోగస్: ఎన్ఐఏపై చిదంబరం విమర్శలు
ABN , First Publish Date - 2021-07-02T16:40:10+05:30 IST
విద్యార్థులు నిరసనకారులపై దేశద్రోహ కేసులు పెట్టడానికి కొద్ది రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు తప్పు పట్టింది. నిరసన హక్కు, ఉగ్ర చర్య మధ్య గీతను చెరపొద్దని ప్రభుత్వానికి హెచ్చరించింది.
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) నిరసన చేస్తున్న వారిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పెట్టిన కేసులన్నీ బోగస్ అని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం విమర్శలు చేశారు. సీఏఏ నిరసనకారుడు అఖిల్ గోగోయ్పై ఎన్ఐఏ పెట్టిన కేసును తాజాగా కోర్టు తప్పుపట్టడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఎన్ఐఏ తాను 2008 సమయంలో చూసిన సంస్థలాగా లేదని, అపఖ్యాతికి చాలా దగ్గరలో ఉందని ఆయన అన్నారు. అయితే ఇప్పటికే అపఖ్యాతి పాలైన దర్యాప్తు సంస్థల మార్గంలోకి వెళ్లకుండా ఎన్ఐఏను కాపాడుకోవడానికి ఇంకా సమయం ఉందని, ఆ వైపుగా చర్యలు తీసుకోవాల్సిన అవసవరం ఉందని చిదంబరం సూచించారు.
విద్యార్థులు నిరసనకారులపై దేశద్రోహ కేసులు పెట్టడానికి కొద్ది రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు తప్పు పట్టింది. నిరసన హక్కు, ఉగ్ర చర్య మధ్య గీతను చెరపొద్దని ప్రభుత్వానికి హెచ్చరించింది. నిరసన చేయడం ప్రజాస్వామిక హక్కని, చట్ట విరుద్ధం కాదని.. ఆందోళనలు కట్టుతప్పినా తీవ్రవాదంగా భావించరాదని స్పష్టం చేసింది.