చికెన్ ధరలు.. భారీగా పెరిగే ఛాన్స్.. అసలు కారణమిదే..!
ABN , First Publish Date - 2020-04-10T20:23:15+05:30 IST
కరోనా భయంతో మొన్నటివరకు కిలో బ్రాయిలర్ చికెన్ రూ.25-50కిలోపే ధర పలికింది. చివరకు బతికున్న కోడిని రూ.25కు ఇచ్చినా తీసుకునేవారు లేరు. పెంపకం, మేత ఖర్చులు కూడా రాక రైతులు నష్టాలను చవిచూశారు.
చిత్తూరు (ఆంధ్రజ్యోతి): కరోనా భయంతో మొన్నటివరకు కిలో బ్రాయిలర్ చికెన్ రూ.25-50కిలోపే ధర పలికింది. చివరకు బతికున్న కోడిని రూ.25కు ఇచ్చినా తీసుకునేవారు లేరు. పెంపకం, మేత ఖర్చులు కూడా రాక రైతులు నష్టాలను చవిచూశారు. దీనివల్ల కొన్నిచోట్ల కోళ్లను మేపలేక మిన్నకుండిపోయారు. మరికొన్ని చోట్ల గొయ్యి తీసి పాతేశారు. ఈ పరిణామాలతో 60శాతం కోళ్ల ఫారాల్లో కోళ్లే లేకుండా పోయాయి. కొన్నిచోట్లే అరకొరగా మిగిలాయి. ఇంటిగ్రేషన్ కంపెనీలు కూడా కొత్త కోడిపిల్లల బ్యాచ్లను పెంచడం ఆపేశాయి. లాక్డౌన్ నేపథ్యంలో మాంసం ప్రియులు ఇపుడు మళ్లీ చికెన్పై పడ్డారు. డిమాండ్ ఏర్పడటంతో కిలో చికెన్ ధర రూ.190-250కు చేరుకుంది. ఈ పరిస్థితులను గమనించిన ఇంటిగ్రేషన్ కంపెనీలు కోడిపిల్లలను పెంచడానికి పోటీలు పడుతున్నాయి. తక్కువ ధరలకే కోడిపిల్లలను సరఫరా చేస్తామని, పెంచడానికి కమీషన్ కూడా ఎక్కువగా ఇస్తామని పత్రికల్లో ప్రకటనలను ఇస్తున్నాయంటే రానున్న రోజుల్లో చికెన్ వ్యాపారం ఏ విధంగా ఉండబోతోందో అర్థమవుతుంది. కొందరైతే రైతుల ఇళ్లవద్దకెళ్లి ఒప్పందాలను సైతం కుదుర్చుకుంటున్నారు. అయినా కంపెనీలు కోడిపిల్లల్ని ఉత్పత్తి చేసి ఫారాలకు సరఫరా చేయాలంటే కనీసం 45 రోజుల సమయం పడుతుంది. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న స్టాకు సరిపోకుంటే చికెన్ ధర మరింత పెరిగే అవకాశం ఉంది.
పెరిగిన గుడ్డు ధరలు
కోడిగుడ్డు ధరలూ అమాంతం పెరిగాయి. పది రోజుల కిందట వరకు కిలో చికెన్ కొంటే ఎనిమిది నుంచి పది వరకు కోడిగుడ్లను ఉచితంగా ఇచ్చేవారు. అయినా కొనేందుకు జనం ముందుకు రాలేదు. ఇపుడు డజను గుడ్లు రూ.60కు చేరుకున్నాయి.
మటన్ కిలో రూ.800
మటన్ కిలో ధర గతంలో రూ.550 వరకు ఉండేది. ప్రస్తుతం బ్రాయిలర్ కోడి మాంసంతోపాటు దీని ధరా బాగా పెరిగి.. రూ.800కు చేరుకుంది. అలాగే నాటు కోడి మాంసం కూడా కిలో రూ.200-250 వరకు ధర ఉండగా.. ప్రస్తుతం రూ.375-400కు విక్రయిస్తున్నారు. బ్రాయిలర్ కోడి తినడానికి ఇష్టపడని వారు మటన్, నాటుకోడి వైపు మొగ్గుచూపడమే ఇందుకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు.