చికెన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు

ABN , First Publish Date - 2022-05-12T09:49:38+05:30 IST

చికెన్‌ ధర ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి చేరుకుంది. గురువారం మార్కెట్‌లో స్కిన్‌లె్‌స చికెన్‌ కిలో ధర రూ.312గా నిర్ణయించారు. కోళ్ల పరిశ్రమ వద్ద ఉన్న రికార్డుల

చికెన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు

స్కిన్‌లెస్‌ కిలో రూ.312 

300 దాటడం ఇదే తొలిసారి

కోళ్ల కొరత పేరిట ధరలు పెంపు


విశాఖపట్నం, మే 11 (ఆంధ్రజ్యోతి): చికెన్‌ ధర ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి చేరుకుంది. గురువారం మార్కెట్‌లో స్కిన్‌లె్‌స చికెన్‌ కిలో ధర రూ.312గా నిర్ణయించారు. కోళ్ల పరిశ్రమ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం ఇప్పటివరకూ గరిష్ఠ ధర రూ.290. ఇప్పుడు దాన్ని కూడా దాటేసి కొత్త రికార్డులు సృష్టిస్తూ సాగుతోంది. మే నెల ఒకటో తేదీన రూ.238 ఉన్న చికెన్‌.. పది రోజుల్లోనే రూ.74 పెరిగి రూ.312కి చేరుకుంది. రానున్న రెండు, మూడు రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. మార్కెట్‌ డిమాండ్‌కు సరిపడినంత చికెన్‌ లేనందున పది రోజుల నుంచి ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. కిలోకు రూ.5 నుంచి రూ.10 తేడాతో దేశవ్యాప్తంగా ఇవే ధరలు ఉన్నాయంటున్నారు.


పెరిగిన డిమాండ్‌..

చికెన్‌ ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు పెరిగి ఏప్రిల్‌ 1 నుంచి నెలాఖరు వరకు వడగాడ్పులు వీచాయి. గాలిలో తేమశాతం తగ్గడం, వర్షాలు లేకపోవడంతో వాతావరణం వేడెక్కింది. ఇది కోళ్ల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది. మేత తక్కువగా తిని, ఎక్కువగా నీళ్లపై ఆధారపడడంతో కోళ్లు ఆశించిన బరువు పెరగలేదు. వేసవిలో 45 రోజులకు సగటున కోడి రెండు కిలోలు అవుతుంది. అటువంటిది ఈసారి కిలోన్నర కూడా రావడం లేదు. ఇంకా ఫారంలో కోళ్లు ఉంచితే ఎండకు చనిపోతాయని అమ్మేస్తున్నారు. దీనికితోడు ఏప్రిల్‌ 15 తర్వాత సముద్రంలో వేట నిలిపివేయడంతో చేపల లభ్యత నిలిచిపోయింది. మరోవైపు వర్షాలు లేక కూరగాయల దిగుబడులు తగ్గడం, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో వ్యాపారాలు జోరందుకోవడంతో... మార్కెట్‌ డిమాండ్‌కు తగినంత చికెన్‌ లభ్యం కావడం లేదు. దీంతో ధరలు పెంచామని కోళ్ల వ్యాపారులు సమర్థించుకుంటున్నారు. 


కంపెనీల గుత్తాధిపత్యమే కారణం

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆదివారం 7లక్షల కిలోలు, మిగిలిన రోజుల్లో సగటున 3-3.5 లక్షల కిలోల కోడిమాంసం అమ్మకాలు జరుగుతున్నాయని, అందు కు తగ్గట్టుగా ఫారాల్లో కోళ్లు లేవని విశాఖ బ్రాయిలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు థాట్రాజు అప్పారావు తెలిపారు. ధరల పెరుగుదల దేశవ్యాప్తంగా ఉందని వివరించారు. కాగా ధరల పెరుగుదలకు కోళ్ల పరిశ్రమలో కంపెనీల గుత్తాధిపత్యమే కారణమని కొందరు రైతులు వివరిస్తున్నారు. ప్రస్తుతం కోళ్ల పరిశ్రమలో 80 నుంచి 85 శాతం వాటా కంపెనీలదేనని, మిగిలిన 15-20 శాతమే రైతులు ఉన్నారని చెబుతున్నారు. దీనికితోడు చాలామంది రైతులు కోళ్లు పెంచి కంపెనీలకు అందిస్తున్నారు. అంటే పిల్ల, మేత, మందులు కంపెనీలు సరఫరా చేస్తుండగా... రైతులు కోళ్లు పెంచి తిరిగి అవే కంపెనీలకు అందజేస్తుంటారు. ఇందుకుగాను ఆ రోజు రేటుపై నాలుగు నుంచి ఆరు రూపాయల వరకు కమీషన్‌ ఇస్తారు. ఈ నేపథ్యంలో ధరల నిర్ణయంలో కంపెనీలదే కీలకపాత్ర కావడంతో మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా రేట్లు పెంచుతున్నారని కొందరు రైతులు చెబుతున్నారు. కంపెనీల మధ్య వ్యాపారపరంగా పోటీ ఉన్నా ధరల నిర్ణయంలో మాత్రమే దాదాపు ఒకేమాట మీద ఉంటారని, ప్రస్తుతం చికెన్‌ ధరల పెంపునకు కంపెనీలే కారణమని నగర శివారు ప్రాంతంలో కోళ్ల పరిశ్రమ నడిపే రైతు ఒకరు వ్యాఖ్యానించారు.

Read more