ఎంపీడీఓల సంఘంలో ‘చిచ్చు’
ABN , First Publish Date - 2020-11-24T05:30:00+05:30 IST
ఎంపీడీఓల సంఘంలో ‘చిచ్చు’
- వికారాబాద్ జిల్లా అధ్యక్షుడి రాజీనామా
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) తెలంగాణ ఎంపీడీఓల అసోసియేషన్లో చిచ్చురేగింది. పదోన్నతుల విషయంలో ప్రస్తుత రాష్ట్ర కమిటీ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ వికారాబాద్ జిల్లా ఎంపీడీఓ అసోసియేషన్ అధ్యక్షుడు హరినందనరావు తన పదవితో పాటు అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం బొమ్మరాశిపేట ఎంపీడీఓగా ఉన్న హరనందనరావు అసోసియేషన్లో జరుగుతున్న అప్రజాస్వామిక, ఏక పక్ష ధోరణి, ఎంపీడీఓలపై వ్యతిరేక చర్యలను నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా డైరెక్ట్ రిక్రూటీలకు పదోన్నతుల విషయంలో నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఎంతోమంది మనస్తాపం చెందుతున్నారని ఆయన తెలిపారు. అసోసియేషన్ నుంచి బయటకు వెళ్లిన వారు ఇంకా సంస్థను తమ చెప్పుచేతుల్లో ఉంచుకున్నారని, దీనివల్ల కొందరు నష్టపోతున్నారని వాపోయారు. అసోసియేషన్లో జరుగుతున్న అక్రమాలను భరించలేకే తన పదవి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు హరినందనరావు వెల్లడించారు.