స్కూళ్లలో విద్యార్థులకు కండోమ్స్.. ఐదో తరగతి నుంచే స్టార్ట్.. చికాగోలో కొత్త కాంట్రవర్సీ!
ABN , First Publish Date - 2021-07-13T20:29:12+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలోని చికాగో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఐదు, ఆపై తరగతుల పిల్లలకు ఇక నుంచి తప్పనిసరిగా కండోమ్స్ సరఫరా చేయాలని నిర్ణయించింది.
చికాగో: అగ్రరాజ్యం అమెరికాలోని చికాగో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఐదు, ఆపై తరగతుల పిల్లలకు ఇక నుంచి తప్పనిసరిగా కండోమ్స్ సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ (సీపీఎస్) బోర్డు కొత్త పాలసీని తీసుకువచ్చింది. ప్రస్తుతం కరోనా వల్ల మూతపడ్డ స్కూల్స్ త్వరలోనే తెరచుకోనున్నాయి. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచే బోర్డు పరిధిలోని 600 పాఠశాలల్లో ఈ కొత్త నిబంధనను అమలు చేయాలని సీపీఎస్ ఆదేశించింది.
సెక్స్ ఎడ్యుకేషన్లో ఇది ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో 2020 డిసెంబర్లోనే సీపీఎస్ బోర్డు ఈ పాలసీని రూపొందించినట్లు తెలుస్తోంది. చికాగో ఆరోగ్యశాఖ.. బోర్డు పరిధిలోని పాఠశాలలకు కండోమ్స్ను సరఫరా చేయనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇకపై ఎల్లప్పుడూ ఎలిమెంటరీ పాఠశాలల్లో 250, హైస్కూళ్లలో 1000 వరకు కండోమ్లు అందుబాటులో ఉంచాలని బోర్డు నిర్ణయించింది.
తల్లిదండ్రుల మండిపాటు
కాగా, బోర్డు నిర్ణయం పట్ల కొంతమంది పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఐదో తరగతి అంటే 10 నుంచి 11 ఏళ్ల పిల్లలు ఉంటారని, వారికి కండోమ్స్ ఇవ్వడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అసలు పిల్లలకు కండోమ్ ఇవ్వాలనే ఆలోచన బోర్డుకు రావడమే విడ్డూరంగా ఉందంటున్నారు. ఇది పిల్లలపై దుష్ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బోర్డు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే, మరికొంత మంది మాత్రం బోర్డు నిర్ణయానికి మద్దతు తెలిపారు. ఏదేమైనప్పటికీ చికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ (సీపీఎస్) బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.