నేనున్నాను..! స్విమ్స్‌ కొవిడ్‌ బాధితులకు చెవిరెడ్డి భరోసా

ABN , First Publish Date - 2020-08-14T14:29:21+05:30 IST

390 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్న తిరుపతిలోని..

నేనున్నాను..! స్విమ్స్‌ కొవిడ్‌ బాధితులకు చెవిరెడ్డి భరోసా

తిరుపతి(ఆంధ్రజ్యోతి): 390 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్న తిరుపతిలోని పద్మావతి రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రి ఛాయలకు పోవాలన్నా చాలామంది భయపడుతుంటారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న 68 మంది సిబ్బందికి కరోనా సోకింది. ఇక్కడ పనిచేయాలంటేనే వైద్యసిబ్బంది జంకుతుంటారు. అక్కడ భయంతోనూ, ఇతర వ్యాధులతోనూ మృతిచెందే కరోనా బాధితుల సంఖ్య ఎక్కువే. అలాంటిది కొవిడ్‌ సమన్వయ కమిటీ వైస్‌ ఛైర్మన్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ధైర్యం చేశారు. గురువారం ఆయన జేసీ వీరబ్రహ్మంతో కలిసి పీపీఈ సూట్‌ ధరించి ఆస్పత్రిని సందర్శించారు. ఆయన ఐసీయూలోకి వెళుతుండగా రెండు కొవిడ్‌ మృతదేహాలను మార్చురీకి తరలిస్తున్నారు.


అయినా ఆయన లెక్కచేయలేదు. అయ్యప్ప మాలధారణలో ఉన్న ఆయన కాళ్లకు చెప్పులు వేసుకోవడానికి వీల్లేదు. కాళ్ల ద్వారా వచ్చే వైరస్‌ సోకే అవకాశం ఉందని తెలిసినా కేవలం పీపీఈ కిట్లకు వచ్చే తొడుగులతోనే ఆస్పత్రిలోకి వెళ్లారు. అక్కడ వైద్యసేవలు పొందుతున్న కరోనా బాధితులను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక్కొక్కరిగా పలకరించారు. డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడారు. కొవిడ్‌ బాధితులకు నాణ్యమైన ఆహారం అందించాలని, మెరుగైన సేవలు కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పద్మావతి రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రిని సందర్శించినట్లు తెలిపారు. 


Updated Date - 2020-08-14T14:29:21+05:30 IST