అగ్రస్థానంలో భారత అమ్మాయిలు
ABN , First Publish Date - 2022-08-06T10:11:47+05:30 IST
చెస్ ఒలింపియాడ్లో కోనేరు హంపి సారథ్యంలోని భారత మహిళల జట్టు అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది.
చెస్ ఒలింపియాడ్
చెన్నై (ఆంధ్రజ్యోతి): చెస్ ఒలింపియాడ్లో కోనేరు హంపి సారథ్యంలోని భారత మహిళల జట్టు అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. శుక్రవారం ముగిసిన ఏడో రౌండ్ పోటీల్లో భారత జట్టు 2.5-1.5తో అజర్బైజాన్పై నెగ్గి 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తొలి గేమ్లో హంపి ఓడిపోగా, రెండో గేమ్ను ద్రోణవల్లి హారిక డ్రా చేసుకుంది. మిగిలిన రెండు గేమ్ల్లో వైశాలి, తానియా నెగ్గడంతో భారత్ గెలిచింది. భారత్-2 జట్టు 1.5-2.5తో పరాజయం పాలవగా, భారత్-3 జట్టు 3-1తో స్విట్జర్లాండ్పై గెలుపొందింది. పురుషుల్లో హరికృష్ణ నేతృత్వంలోని భారత జట్టు 3-1తో భారత్-2ను ఓడించింది. హరికృష్ణ, విదిత్ తమ గేమ్లను డ్రా చేసుకోగా, అభిజిత్ గుప్తాపై ఇరిగేసి అర్జున్, పురానిక్పై నారాయణ్ నెగ్గి భారత్ను విజేతగా నిలిపారు. భారత్-2 3.5-0.5తో క్యూబాను చిత్తు చేసింది. గుకేష్, సరీన్, ప్రజ్ఞానందా విజయాలు సాధించగా.. అధిబన్ డ్రాతో సరిపెట్టుకున్నాడు.