Chennapuri Telugu Academy: ‘తెలుగువీర లేవరా’ సంపుటాల ఆవిష్కరణ

ABN , First Publish Date - 2022-10-03T14:03:40+05:30 IST

చెన్నపురి తెలుగు అకాడమీ(Chennapuri Telugu Academy) ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా ‘తెలుగువీర లేవ

Chennapuri Telugu Academy: ‘తెలుగువీర లేవరా’ సంపుటాల ఆవిష్కరణ

ప్యారీస్‌(చెన్నై), అక్టోబరు 2: చెన్నపురి తెలుగు అకాడమీ(Chennapuri Telugu Academy) ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా ‘తెలుగువీర లేవరా’ పేరిట దివంగత తెలుగు ప్రముఖులు ఎన్జీ రంగా,  పీవీ నరసింహరావు, మోటూరి సత్యనారాయణలకు అంకితం చేస్తూ మూడు సంపుటాలను ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. మైలాపూరుని ఓ హోటల్‌లో జ్యోతిప్రజ్వలనతో ప్రారంభమైన కార్యక్రమంలో అకాడమీ మేనేజింగ్‌ ట్రస్టి డా. తూమాటి సంజీవరావు స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్య అతిథి, మాజీ ఐపీఎస్‌ అధికారి వి.చంద్రకిశోర్‌, విశిష్ట అతిథులు భారతి మహిళా కళాశాల విశ్రాంత తెలుగు ఆచార్యులు నిర్మలా పళనివేలు, ఆకాశవాణి చెన్నై కేంద్రం మాజీ సంచాలకులు వేణుగోపాల్‌రెడ్డి ఈ మూడు సంపుటాలను ఆవిష్కరించారు. తొలిప్రతులను దిట్టకవి అనంతపద్మనాభమూర్తి, మంగళాకందూర్‌, మునిరత్నంనాయుడు స్వీకరించారు. ఈ సందర్భంగా చంద్రకిశోర్‌ మాట్లాడుతూ తెలుగువారినందరినీ మేల్కొలిపే రీతిలో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రముఖ సంగీత దర్శకులు ఎంఆర్‌ సుబ్రహ్మణ్యం తెలుగువీర లేవారా పాటతోపాటు దేశభక్తి గీతాలను ఆలపించి సభికులను మైమరపించారు. గాయని వసుంధర, రంగస్థల కళాకారుడు కాకాని వీరయ్య తెలుగుగీతాలు, పద్యాలను ఆలాపించారు. కల్పనా గుప్తా నిర్వహణలోజరిగిన కార్యక్రమంలో అకాడమీ కార్యదర్శి తిరునగరి భాస్కర్‌ వందన సమర్పణ చేశారు.

Updated Date - 2022-10-03T14:03:40+05:30 IST