ఫోన్ రావడంతో వెళ్లారు.. అక్కడ ఉన్న వ్యక్తి పరిస్థితిని గమనించి.. ఈ ఎస్సై ఏం చేశారో తెలిస్తే..
ABN , First Publish Date - 2021-11-12T13:47:34+05:30 IST
గురువారం..
భుజం తట్టిన బాధ్యత!
వ్యక్తిని మోసుకెళ్లి ప్రాణాలు కాపాడిన ఎస్సై
చెన్నై(ఆంధ్రజ్యోతి): గురువారం.. చెన్నై టీపీ ఛత్రం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేశ్వరి ముంపు బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో ఉన్నారు. ఇంతలో ఆమెకు ఓ ఫోన్ వచ్చింది. కీల్పాక్లోని సిమెట్రీ వద్ద ఫుట్పాత్పై వ్యక్తి మృతదేహం పడి ఉందనేది దాని సారాంశం. ఆమె వెంటనే అక్కడకు వెళ్లారు. వర్షానికి బాగా తడిసి, ఫుట్పాత్మీద అచేతన స్థితిలో ఓ వ్యక్తి పడి ఉన్నాడు. అందరూ చనిపోయాడనే భావించారు. దగ్గరకు వెళ్లిన ఎస్ఐ పరిశీలించి చూడగా ఇంకా ఊపిరి ఉన్నట్టు తేలింది. అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించాలని అనుకున్నారు. అయితే, తడిసిపోయి మురికిగా ఉన్న ఆ వ్యక్తిని పట్టుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రాజేశ్వరి స్వయంగా భుజాలపై ఎత్తుకుని ఆటోలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యంగా ఉన్నాడు.
ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో రావడంతో ఎస్సైని పోలీస్ ఉన్నతాధికారులతో పాటు నగరవాసులు అభినందనల్లో ముంచెత్తుతున్నారు. నగర పోలీస్ కమిషన్ శంకర్ జీవాల్ రాజేశ్వరిని స్వయంగా కమిషనరేట్కు పిలిపించుకుని అభినందించారు. అలాగే ప్రముఖ నటుడు కమల్తో పాటు పలువురు ప్రముఖులు ఆమెను అభినందించారు.