భారత దేశ ‘ఆర్’ విలువ పెరిగింది : పరిశోధకులు

ABN , First Publish Date - 2022-04-20T22:41:14+05:30 IST

కోవిడ్ విషయంలో భారత దేశ ఎఫెక్టివ్ రీప్రొడక్షన్ నంబర్ (R)

భారత దేశ ‘ఆర్’ విలువ పెరిగింది : పరిశోధకులు

న్యూఢిల్లీ : కోవిడ్ విషయంలో భారత దేశ ఎఫెక్టివ్ రీప్రొడక్షన్ నంబర్ (R) పెరిగినట్లు చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ పరిశోధకులు వెల్లడించారు. ఈ మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తోందనడానికి ఇది సంకేతమని తెలిపారు. జనవరి నుంచి పరిశీలించినపుడు R విలువ మొదటిసారి 1 (ఒకటి)ని దాటినట్లు తెలిపారు. 


కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి భారత దేశ R విలువను పరిశీలిస్తున్న మ్యాథమెటీషియన్ సిటబ్ర సిన్హా మాట్లాడుతూ, కొద్ది వారాల నుంచి మన దేశ R విలువ నిలకడగా పెరుగుతున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 12-18 మధ్య కాలంలో ఇది 1.07గా ఉందన్నారు. ఏప్రిల్ 5-11 మధ్య కాలంలో ఇది 0.93 అని పేర్కొన్నారు. జనవరి 16-22 మధ్య కాలంలో ఇది 1.28 ఉండేదన్నారు. ఈ విలువ పెరగడానికి కారణం కేవలం ఢిల్లీ మాత్రమే కాదని, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు కూడానని చెప్పారు. 


R విలువ 1 కన్నా ఎక్కువగా ఉంటే, కోవిడ్ యాక్టివ్ కేసులు పెరిగినట్లు అర్థం చేసుకోవాలని చెప్పారు. ఈ మహమ్మారిని కట్టడి చేయాలంటే R విలువ 1 కన్నా తక్కువ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 1 కన్నా తక్కువగా R విలువ ఉంటే ఈ వ్యాధి వ్యాప్తి ఆగిపోతుందన్నారు. 


జనవరి 1-10 మధ్య కాలంలో కోవిడ్ వేరియెంట్ ఒమైక్రాన్ విజృంభించడంతో R విలువ 2.98గా ఉండేది.  ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో R విలువ 1 కన్నా ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌లలో దీని విలువ 2కు పైమాటేనన్నారు. కోల్‌కతాకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవని తెలిపారు.


Updated Date - 2022-04-20T22:41:14+05:30 IST