శతవసంతంలోకి చెన్నై - ముంబై Express
ABN , First Publish Date - 2021-12-02T17:38:44+05:30 IST
చెన్నై - ముంబై నగరాల మధ్య తిరిగే ముంబై ఎక్స్ప్రెస్ (రైలు నంబరు 22159/22160) శతాబ్ది వేడుకలను జరుపుకుంది. ఈ రైలును గత 1921లో మద్రాస్ - బాంబే ఫాస్ట్ ప్యాసింజరు రైలుగా ప్రవేశపెట్టారు. ఆ
- కేక్ కట్చేసిన దక్షిణ రైల్వే అధికారులు
అడయార్(చెన్నై): చెన్నై - ముంబై నగరాల మధ్య తిరిగే ముంబై ఎక్స్ప్రెస్ (రైలు నంబరు 22159/22160) శతాబ్ది వేడుకలను జరుపుకుంది. ఈ రైలును గత 1921లో మద్రాస్ - బాంబే ఫాస్ట్ ప్యాసింజరు రైలుగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కాలంతో పాటు ఈ రైలును కూడా ఫాస్ట్ ప్యాసింజర్ నుంచి ఎక్స్ప్రెస్ రైలుగా మార్చారు. ఈ రైలు ప్రవేశపెట్టి వందేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా దక్షిణ రైల్వే శతాబ్ది వేడుకలను బుధవారం నిర్వహించింది. అన్ని రకాల బోగీలు కలిగిన ఈ రైలు శతాబ్ది వేడుకలను చెన్నై సెంట్రల్లో నిర్వహించగా, ఇందులో ఏడీఆర్ఎం-1 ఆర్.అనంత్, ఏడీఆర్ఎం-2 సచిన్ పునీత, ఏడీఆర్ఎం-3 ఎస్.సుబ్రమణియన్, చెన్నై రైల్వే డివిజన్కు చెందిన ఉన్నతాధికారులు పాల్గొని, కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. కాగా, తొలుత ఫాస్ట్ ప్యాసింజరుగా ప్రవేశపెట్టిన తర్వాత 1930 మార్చి ఒకటో తేదీ నుంచి ఎక్స్ప్రెస్ రైలుగా మార్చారు. అప్పటి నుంచి ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ - చెన్నై సెంట్రల్ మధ్య ఎక్స్ప్రెస్ రైలుగా సేవలు అందిస్తుంది. గత యేడాది జూలై ఒకటో తేదీ నుంచి ఈ రైలును సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రె్సగా మార్చారు. ఈ రైలు మొత్తం 1,284 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తన గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. చెన్నై - ముంబై ప్రాంతాల మధ్య 31 రైల్వే స్టేషన్లలో ఆగివెళుతుంది. ప్రధానంగా దేశంలో ప్రధాన రైల్వే స్టేషన్లు అయిన అరక్కోణం, రేణిగుంట, కడప, గుంతకల్, రాయ్చూర్, యాద్గిర్, షోలాపూర్, దౌండ్, పూణే ప్రాంతాల మీదుగా ముంబైకు చేరుకుటుంది. ఈ రైలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది.