ఆ మూడు శాఖలు సమన్వయంతో పనిచేయాలి: హైకోర్టు ఆదేశం
ABN , First Publish Date - 2021-12-29T16:49:04+05:30 IST
ఆక్రమణలకు గురైన ఆలయ భూములను గుర్తించి, స్వాధీనం చేసుకునే విషయంపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఆలయ భూముల స్వాధీన సమయంలో రెవెన్యూ,
అడయార్(చెన్నై): ఆక్రమణలకు గురైన ఆలయ భూములను గుర్తించి, స్వాధీనం చేసుకునే విషయంపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఆలయ భూముల స్వాధీన సమయంలో రెవెన్యూ, దేవాదాయ, హోం శాఖ అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించింది. నగరానికి చెందిన ఆర్.రాధాకృష్ణన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. నగర శివారు ప్రాంతమైన నందంబాక్కంలో కోదండరామస్వామి ఆలయానికి చెందిన 150 ఎకరాలు భూములు ఆక్రమణలకు గురయ్యాయని, ఈ భూములను కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి తమ పేరుమీద మార్చుకున్నారని, ఈ భూముల అక్రమణలను అడ్డుకోవాలని జిల్లా యంత్రాంగం, రెవెన్యూ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని ఆయన తన పిటిషన్లఓ పేర్కొన్నారు. అందువల్ల తన ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన జస్టిస్ ఎస్ఎం.సుబ్రమణి దేవాలయ భూముల స్వాధీనం విషయంలో హోం, దేవాదాయ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే, ఫిర్యాదుదారుడు చేసిన అంశంపై లోతుగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశిస్తూ, కేసు విచారణను ముగించారు.