వరద ముంపునకు శాశ్వత పరిష్కారం

ABN , First Publish Date - 2022-01-04T14:03:22+05:30 IST

రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరాన్ని వరద ముంపు నుంచి తప్పించడంపై నిపుణుల కమిటీ నివేదిక సిద్ధం చేసింది. దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన నగరంగా వున్న చెన్నై కాస్త వర్షానికే ముంపునకు

వరద ముంపునకు శాశ్వత పరిష్కారం

- నివేదికను సిద్ధం చేసిన నిపుణుల కమిటీ

- సీఎంకు అందజేత


అడయార్‌(చెన్నై): రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరాన్ని వరద ముంపు నుంచి తప్పించడంపై నిపుణుల కమిటీ నివేదిక సిద్ధం చేసింది. దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన నగరంగా వున్న చెన్నై కాస్త వర్షానికే ముంపునకు గురవుతుండడంతో ప్రజలు ఇబ్బంది పడడంతో పాటు వాణిజ్యపరంగానూ తీవ్రంగా నష్టపోతోంది. అందుకే దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ అన్ని విధాలుగా అధ్యయనం చేసి నివేదికను రూపొందించింది. ముంపునకు గల కారణాలను అన్వేషించడంతోపాటు వాటికీ పరిష్కారాలనూ చూపింది. ఈశాన్య రుతుపవనాల కారణంగా కురిసిన భారీ వర్షాలకు చెన్నైనగరంలో జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీనిపై మద్రాసు హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2015 వరదల తర్వాత చెన్నై నగరం వరద ముంపునకు గురికాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ చెన్నై నగర పాలక సంస్థ (చెన్నై కార్పొరేషన్‌)ను సూటిగా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో వరద ముంపునకు శాశ్వత పరిష్కారం కనుగొనేలా ఒక ప్రణాళికను తయారు చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి తిరుప్పుగళ్‌ సారథ్యంలో ఏర్పాటు చేసిన ఈ నిపుణుల కమిటీ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, వరద ముంపునకు గల కారణాలపై అధ్యయనం చేసి నివేదికను తయారు చేసింది. ఇందులో వరద ముంపును అడ్డుకునే చర్యలత పాటు ఇందుకోసం శాశ్వత పరిష్కార మార్గాలను పేర్కొన్నట్టు సమాచారం. అలాగే, చెన్నై నగర శివారు ప్రాంతాల్లో వర్షపునీటి  కాలువలను ఆక్రమించి నిర్మించిన భవనాలను తొలగించాలని కోరారు. అలాగే, ఈ కాలువలను వెడల్పు చేయడంతో పాటు మరింత లోతుకు తవ్వేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. అన్ని అంశాలతో విపులంగా తయారు చేసిన ఈ నివేదికను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు సోమవారం అందజేసింది. 

Updated Date - 2022-01-04T14:03:22+05:30 IST