ప్రభుత్వ మద్యంలో ప్రమాదకర రసాయనాలు
ABN , First Publish Date - 2022-06-26T08:02:19+05:30 IST
ప్రభుత్వ మద్యంలో ప్రమాదకర రసాయనాలు
వాటిని తాగితే తీవ్ర ఆరోగ్య సమస్యలు
3 బ్రాండ్లపై ల్యాబ్ నివేదికలు బయటపెట్టిన టీడీపీ నేతలు
అవి ఆంధ్రా గోల్డ్, సిల్వర్ స్టైప్స్ విస్కీ, నైన్ సీ హార్స్ బ్రాండ్లు
వాటిలో పైరో గెలాల్, ఐసో ఫ్లూరిక్ యాసిడ్ ఉన్నాయి
సిల్వర్ స్టైప్స్ విస్కీలో డైతలీ పాతలేట్ కూడా ఉంది
ఇవి చాలా ప్రమాదకరమైన రసాయనాలు
జే ట్యాక్స్ కోసం పనికిమాలిన బ్రాండ్లు అమ్ముతున్నారు
పంచుమర్తి అనురాధ, ఆనం వెంకట రమణా రెడ్డి ధ్వజం
అమరావతి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విక్రయిస్తున్న కొన్ని మద్యం బ్రాండ్లలో తీవ్ర అనారోగ్యానికి దారితీసే ప్రమాదకర రసాయనాలు ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ సంచలన ఆరోపణ చేసింది. అతి పెద్ద ల్యాబ్లో తాము చేయించిన పరీక్షల్లో వెల్లడైన ఫలితాలను ఆ పార్టీ నేతలు శనివారం ఇక్కడ బయటపెట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధులు పంచుమర్తి అనురాధ, ఆనం వెంకట రమణా రెడ్డి, రసాయన నిపుణుడు వరుణ్ కుమార్ విలేకరులకు ఆ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ మద్యం షాపుల్లో తాము కొనుగోలు చేసిన ఆంధ్రా గోల్డ్, సిల్వర్ స్టైప్స్ విస్కీ, నైన్ సీ హార్స్ బ్రాండ్లను లాబ్లో పరీక్ష చేయిస్తే దిగ్ర్భాంతి కలిగించే విషయాలు వెల్లడయ్యాయన్నారు. ఆరోగ్యానికి తీవ్రంగా నష్టం కలిగించే రసాయనాలు వీటిలో ఉన్నాయని చెప్పారు. ఆ రసాయనాలు ప్రభుత్వ మద్యం బ్రాండ్లలో ఉన్నాయో లేదో ప్రభుత్వం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆ మూడు బ్రాండ్ల మద్యం సీసాలను కూడా విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ుఈ మూడు బ్రాండ్లలోనూ పైరో గెలాల్, ఐసో ఫ్లూరిక్ యాసిడ్ అనే ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి. ఈ రసాయనాలు ఉన్న ద్రవాలు సేవించడం వల్ల దగ్గు, గొంతు నొప్పి, చర్మం కందిపోవడం, వాంతులు, అతిసారం, శ్వాస ఒక్కసారిగా పెరిగిపోవడం, బీపీ పడిపోవడం, ఒక్కసారిగా నాడి కొట్టుకొనే వేగం పెరగడం, తల తిరగడం, తలనొప్పి, కడుపు నొప్పి, మానసిక గందరగోళం, శరీరం మెలికలు తిరగడం, మూర్ఛపోవడం, లివర్ సంబంధిత వ్యాధులకు గురి కావడం, కళ్లు ఎర్రబడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. సిల్వర్ స్టైప్స్ విస్కీలో ఈ రెండు రసాయనాలకు తోడు అదనంగా డైతలీ పాతలేట్ అనే మరో ప్రమాదకర రసాయనం కూడా ఉంది. దీనివల్ల పై సమస్యలతోపాటు అరిచెయ్యి, అరికాలులో సూదులతో గుచ్చినట్లు ఉండటం, చర్మంపై దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. పలు దేశాల్లో ల్యాబ్లు నిర్వహిస్తున్న ఎస్జీఎస్ సంస్థకు చెన్నైలో ఉన్న ప్రయోగశాలలో ఈ పరీక్షలు చేయించాం. మా మద్యం షాపుల్లో కొన్నారో... మరెక్కడ కొన్నారో అంటారేమోనని మేం కొనుగోలు చేసిన మద్యం షాపులను జియో ట్యాగింగ్ చేశాం. వాటి చిత్రాలు కూడా తీసుకున్నాం. మద్యం కొనుగోలు చేస్తున్న దృశ్యాలు కూడా రికార్డు చేశాం్ అని చెప్పారు. ప్రజల ఆరోగ్యం పాడవకూడదన్నదే తమ ఉద్దేశమని రసాయన నిపుణుడు వరుణ్ తెలిపారు. ఈ బ్రాండ్లలో ఈ రసాయనాలు ఉన్నాయా లేదా అన్నదానిపై ప్రభుత్వం ఆధారాలతో ముందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ుమద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రచారం చేసి.. మహిళలతో ఓట్లు వేయించుకొన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చివరకు తన జే ట్యాక్స్ కోసం పనికిమాలిన బ్రాండ్లు తెచ్చి ప్రజల ప్రాణాలు తీస్తుండటం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. నాసి రకం మద్యం మహిళల తాళిబొట్లు తెంచుతుంటే జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలె్సలో కూర్చుని తనకు వచ్చే ఆదాయాన్ని లెక్కపెట్టుకొంటూ సంబరపడిపోతున్నారు. ప్రజల శవాల మీద వ్యాపారం చేస్తున్నారు. ఇది సరికాదని గతంలో మేం చెబితే దిద్దుకోకపోగా అధికారులతో అబద్ధాలు చెప్పించారు. వీటిని తాగుతున్న వారికి ఇప్పుడు వచ్చే జబ్బులే కాక వారి పిల్లలు కూడా భవిష్యత్తులో అనేక అవయవ లోపాలతో పుట్టే ప్రమాదం ఉంది. ఈ ముఖ్యమంత్రి చివరికి రాష్ట్రాన్ని అంగ వికలాంగ ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నారు్ అని పంచుమర్తి అనురాధ విమర్శించారు. తాడేపల్లి ప్యాలె్సకు పన్ను కడితే ప్రజలకు ఎంత పనికిమాలిన మద్యం పోసినా ఎవరూ అడిగేవారు లేని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందని, అందుకే దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఇక్కడ అమ్ముడవుతున్నాయని ఆమె ఆరోపించారు. గోవా, పుదుచ్ఛేరి, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి అక్ర మ మద్యం తెచ్చి ప్రభుత్వ మద్యం షాపుల్లో విక్రయిస్తున్నారని, అందుకే నగదు తప్ప మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులను అనుమతించడం లేదని ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. నెల్లూరులో ఒక మద్యం షాపులో అక్రమ మద్యం దొరికితే అసలు దొంగలను వదిలిపెట్టి సేల్స్మెన్లపై కేసు పెట్టారన్నా రు. మందుబాబులను తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకొన్న ఏకైక సీఎం జగన్ రెడ్డి ఒక్కరేనని, 20 ఏళ్లపాటు మద్యం తాగి తీరుతారని హామీపత్రం రాసిచ్చి బ్యాంకుల నుంచి అప్పు తెచ్చారని తెలిపారు.