ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
ABN , First Publish Date - 2022-09-30T05:27:18+05:30 IST
కరీంనగర్ కళోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్యాంప్ ఫైర్ ఉత్సాహంగా కొనసాగింది. 20 రాష్ర్టాల కళాకారులతోపాటు ఇజ్రాయిల్, మలేషియా, ఇండోనేషియా, అండమాన్ నికోబార్, తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
- అంబేద్కర్ స్టేడియంలో క్యాంప్ ఫైర్
- ఆడిపాడిన కళాకారులు
- పాల్గొన్న మంత్రి గంగుల, కలెక్టర్, సీపీ, మేయర్
కరీంనగర్ కల్చరల్, సెప్టెంబరు 29: కరీంనగర్ కళోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్యాంప్ ఫైర్ ఉత్సాహంగా కొనసాగింది. 20 రాష్ర్టాల కళాకారులతోపాటు ఇజ్రాయిల్, మలేషియా, ఇండోనేషియా, అండమాన్ నికోబార్, తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారికి మంత్రి గంగుల కమలాకర్ స్వాగతం పలికారు. పూలమాలలు వేసి కళాకారులను పరిచయం చేసుకున్నారు. ఇండోర్ స్టేడియం ఎదుట నిర్వహించిన వన్ మినట్ క్రాకర్ షో ఆకట్టుకుంది. క్యాంప్ ఫైర్ చుట్టూ కళాకారులు వారి సాంప్రదాయాలను అనుసరించి నృత్యాలు చేస్తూ పాటలు పాడారు. శుక్రవారం నుంచి మూడురోజులపాటు జరగనున్న కళోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ కళోత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు చేసి ప్రభుత్వం యంత్రాంగం తోడ్పాటునందించిందని అన్నారు. కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, సీపీ సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్ పాల్గొన్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి గంగుల
కరీంనగర్ అంతర్జాతీయ కళోత్సవాలకు ముస్తాబైంది. శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజుల పాటు అంబేద్కర్ స్టేడియంలో కరీంనగర్ కళోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో శక్రువారం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఏర్పాట్లను పరిశీలించారు. వేదికతోపాటు బారీకేడ్ల పనులు, స్టేడియంను సుందరంగా తీర్చిదిద్దే పనులు పూర్తయ్యాయి. కళకారుల రిహార్సల్స్ను మంత్రి పరిశీలించారు. వివిధ రాష్ర్టాలకు, పలు దేశాలకు చెందిన కళాకారులు కరీంనగర్కు చేరుకున్నారు. ఉత్సవాలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులు, నిర్వాహకులను మంత్రి ఆదేశించారు.