‘బూస్టర్‌ డోసు’ను పరిశీలించండి

ABN , First Publish Date - 2021-12-04T07:22:57+05:30 IST

హైరిస్కు గ్రూపు వారికి బూస్టర్‌ డోసు టీకా ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు.

‘బూస్టర్‌ డోసు’ను పరిశీలించండి

  • హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌ను పరిగణనలోకి తీసుకోండి
  • కొవిషీల్డ్‌ డోసుల వ్యవధిని 4 వారాలకు తగ్గించాలి
  • కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి హరీశ్‌రావు లేఖ


హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): హైరిస్కు గ్రూపు వారికి బూస్టర్‌ డోసు టీకా ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాన్‌సుఖ్‌ మాండవీయకు ఆయన లేఖ రాశారు. తెలంగాణలోని వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పని చేసిన రెవెన్యూ, పోలీసు విభాగాలతో పాటు హైరిస్కు గ్రూపు వారికి బూస్టర్‌ డోసు ఇవ్వాలని ఆ లేఖలో హరీశ్‌ విజ్ఞప్తి చేశారు. వీరంతారెండో డోసు టీకా తీసుకొని 8-10 నెలలు దాటిందని గుర్తుచేశారు. వ్యాక్సిన్‌ తీసుకొని ఎక్కువ కాలం అవుతుండడం, కొత్త వేరియంట్లు వస్తుండడాన్ని దృష్టిలో ఉంచుకొని బూస్టర్‌ డోసు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని ప్రతిపాదించారు. అలాగే, కొవిషీల్డ్‌ డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని కేంద్రాన్ని కోరారు. రెండో డోసు తీసుకునేందుకు 12 వారాల వ్యవధి ఉండటంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వలస కూలీలు మొదటి డోసు వేసుకున్న తర్వాత ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ర్టాలకు వెళ్లిపోతున్నారని, వారిని గుర్తించి రెండో డోసు వేయడం కష్టంగా మారిందని తెలిపారు.


ముఖ్యంగా అంతర్రాష్ట్ర కూలీల విషయంలో ఈ ఇబ్బంది ఎక్కువగా ఉందని వెల్లడించారు. మొదటి డోసు వేసుకున్న వారి వివరాలు కొవిన్‌ పోర్టల్లో అప్‌లోడ్‌ చేస్తున్నా, ఆ జాబితా ఆ రాష్ర్టానికే పరిమితం కావడంతో వలస కూలీలను అప్రమత్తం చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. రెండో డోసుకు 12వారాల గడువు ఉండడంతో కొందరిలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఈ కారణాల దృష్ట్యా రెండో డోసు వ్యవధిని గతంలో మాదిరిగా 4 లేదా 6 వారాలకు తగ్గించాలని సూచించారు. తెలంగాణలో 2.77 కోట్ల మంది కొవిడ్‌ టీకాకు అర్హులని గుర్తించగా... 2.49 కోట్ల మంది మొదటి డోసు, 1.28 కోట్ల మంది రెండో డోసు తీసుకున్నారని వివరించారు.

Updated Date - 2021-12-04T07:22:57+05:30 IST