లోపభూయిష్ట చట్టాలతో కోర్టులకు పనిభారం

ABN , First Publish Date - 2021-11-28T08:19:52+05:30 IST

చట్టసభలు తాము ఆమోదించే చట్టాల ప్రభావాన్ని అంచనా వేయకపోతే కొన్ని సార్లు పెద్ద సమస్యలకు దారి తీస్తుందని, న్యాయవ్యవస్థపై కేసుల భారం పెరిగిపోతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ అన్నారు. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ చట్టంలో సెక్షన్‌ 138ని ప్రవేశ పెట్టడాన్ని

లోపభూయిష్ట చట్టాలతో కోర్టులకు పనిభారం

  • చెక్‌బౌన్స్‌ కేసులతో కింది కోర్టులు అతలాకుతలం
  • రాష్ట్రాలు గ్రాంట్లు ఇవ్వడం లేదు
  • రాజ్యాంగ దినోత్సవాల్లో సీజేఐ


న్యూఢిల్లీ,నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): చట్టసభలు తాము ఆమోదించే చట్టాల ప్రభావాన్ని అంచనా వేయకపోతే కొన్ని సార్లు పెద్ద సమస్యలకు దారి తీస్తుందని, న్యాయవ్యవస్థపై కేసుల భారం పెరిగిపోతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ అన్నారు. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ చట్టంలో సెక్షన్‌ 138ని ప్రవేశ పెట్టడాన్ని ఇందుకు ఉదాహరణగా ప్రస్తావించారు. ఈ చట్టానికి సంబంధించి కింది కోర్టుల్లో వేల కేసులు పేరుకుపోయాయని, ఇప్పటికే కేసుల భారంతో సతమతమవుతున్న మెజిస్ట్రేట్లపై ఈ చట్టం వల్ల మరింత భారం పడిందని  చెప్పారు. బ్యాంకు ఖాతాల్లో సరిపడా నిధుల్లేకుండా జారీచేసే చెక్కులు చెల్లక పోవడం గురించి ఈ చట్టాన్ని చేశారని ప్రస్తావించారు.  రాజ్యాంగ దినోత్సవాల ముగింపు సందర్భంగా ఆయన న్యాయమూర్తులు, న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎటువంటి సమస్యలెదురైనా న్యాయాన్ని అందించే లక్ష్యం దెబ్బ తినకూడదని స్పష్టం చేశారు. రెండు రోజుల పాటు రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా జరిగిన సదస్సులో వచ్చిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.


న్యాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.9 వేల కోట్లు మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తపరిచారు. రాష్ట్ర ప్రభుత్వాలు మాచింగ్‌ గ్రాంట్లతో ముందుకు రాకపోవడం, కేంద్ర నిధులను వినియోగించుకోక పోవడం సమస్యగా మారిందన్నారు. అందుకే, తాను న్యాయ మౌలిక సదుపాయాల అథారిటీ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నానని చెప్పారు. న్యాయ వ్యవస్థల్లో ఖాళీలను కూడా వేగంగా భర్తీ చేయాలని న్యాయమంత్రిని కోరారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు తాము నిర్విరామంగా కృషి చేస్తున్నప్పటికీ రాజ్యాంగం గురించి అవగాహన కల్పించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని జస్టిస్‌ రమణ చెప్పారు.  న్యాయవ్యవస్థ పునర్నిర్మాణం జరగాలన్న అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సూచనలను సీజే ప్రస్తావించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు.  న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని రాష్ట్రపతి చెప్పడం పట్ల జస్టిస్‌ రమణ హర్షం వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ వంటి సమస్యలు వచ్చినపుడు న్యాయ వ్యవస్థ అవసరానికి తగ్గట్లు పని చేసిందని చెప్పారు. భారతీయ న్యాయ వ్యవస్థే అన్నిటి కంటే ముందుగా ఆన్‌లైన్‌ పద్ధతిలో పని చేసిందన్నారు. 

Updated Date - 2021-11-28T08:19:52+05:30 IST