సంతకం ఫోర్జరీ చేసి.. ధాన్యం తనఖా

ABN , First Publish Date - 2020-05-23T10:41:22+05:30 IST

గిడ్డంగిలోని వేలాది బస్తాల ధాన్యాన్ని చూపి ఒక బ్యాంకులో రూ.6 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ

సంతకం ఫోర్జరీ చేసి.. ధాన్యం తనఖా

గిడ్డంగిలోని ధాన్యంపై రూ.6 కోట్ల రుణం

ఆ మొత్తం చెల్లించకుండానే మరో బ్యాంకులోనూ రుణం

బ్యాంకు మేనేజర్‌ తనిఖీతో వెలుగులోకి

నిందితులపై చీటింగ్‌ కేసు నమోదు


ప్రొద్దుటూరు క్రైం, మే 22 : గిడ్డంగిలోని వేలాది బస్తాల ధాన్యాన్ని చూపి ఒక బ్యాంకులో రూ.6 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ మేరకు ఆ బ్యాంకు వారు ధాన్యం బస్తాలకు ట్యాగ్‌లు వేశారు. అనంతరం ఫీల్డ్‌ ఆఫీసర్‌ సంతకం ఫోర్జరీ చేసి ధాన్యం బస్తాలను రిలీజ్‌ చేసుకుని మరో బ్యాంకులో రుణం తీసుకున్నారు. మొదట రుణం ఇచ్చిన బ్యాంకు మేనేజర్‌ గిడ్డంగిని తనిఖీ చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంకును మోసం చేసిన వారిపై శుక్రవారం చీటింగ్‌ కేసు నమోదైంది. ప్రొద్దుటూరు త్రీటౌన్‌ సీఐ సుబ్బారావు వివరాల మేరకు... 


చాపాడు మండలం పల్లవోలు గ్రామానికి చెందిన ఓ వ్యవసాయ గిడ్డంగిలో ఉన్న వేలాది ధాన్యం బస్తాలపై సదరు గిడ్డంగి యజమాని నరసింహారెడ్డి, నేషనల్‌ బల్క్‌హ్యాండ్లింగ్‌ కార్పొరేషన్‌ (ఎన్‌బీహెచ్‌సీ) సూపర్‌వైజర్‌ కలిసి ప్రొద్దుటూరు ఎస్‌బీఐ ఏడీబీ బ్రాంచి నుంచి రూ.6 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ రుణం చెల్లించకుండానే గిడ్డంగి యజమాని, ఎన్‌బీహెచ్‌సీ సూపర్‌వైజర్‌ కలిసి బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్‌ సంతకం ఫోర్జరీ చేసి వడ్లబస్తాలను రిలీజ్‌ చేసుకున్నారు. అవే ధాన్యం బస్తాలపై ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణం తీసుకున్నారు.


ఇదిలా ఉండగా, ఎస్‌బీఐ ఏడీబీ చీఫ్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ సదరు వ్యవసాయ గిడ్డంగికి తనిఖీకి వెళ్లగా, అక్కడ ధాన్యం బస్తాలకు తమ బ్యాంక్‌ ట్యాగ్‌లు కాకుండా ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కార్పొరేషన్‌ ట్యాగ్‌లు ఉండటాన్ని గుర్తించారు. తమను మోసం చేశారని తెలుసుకున్న ఆయన త్రీటౌన్‌ పోలీసులకు గిడ్డంగి యజమానితో పాటు 53 మంది రైతులు, ఇందుకు సహకరించిన ఎన్‌బీహెచ్‌సీ మేనేజర్‌, సూపర్‌వైజర్‌లపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్‌ సీఐ సుబ్బారావు తెలిపారు.

Updated Date - 2020-05-23T10:41:22+05:30 IST