పోలీసు అవతారమెత్తిన దొంగ అరెస్టు
ABN , First Publish Date - 2022-06-26T04:54:41+05:30 IST
వ్యసనాలకు బానిసై, ఈజీ మనీ సంపాదన కోసం ఏకంగా పోలీసు అధికారి అవతారమెత్తి చోరీలకు పాల్పడిన దొంగను దర్గామిట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.
పలు పోలీసు స్టేషన్ పరిధిలో కేసులు
నెల్లూరు(క్రైం), జూన్ 25: వ్యసనాలకు బానిసై, ఈజీ మనీ సంపాదన కోసం ఏకంగా పోలీసు అధికారి అవతారమెత్తి చోరీలకు పాల్పడిన దొంగను దర్గామిట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పోలీసు స్టేషన్లో సీఐ జి. దశరఽథరామారావు శనివారం విలేకర్ల సమావేశంలో నిందితుడి వివరాలను వెల్లడిం చారు. వైఎస్ఆర్కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన షేక్ షఫీ కోవూరు సత్రం వీధిలో ఉంటున్నాడు. వ్యసనాలకు బానిసై పోలీసు అధికారిగా అవతారమెత్తి అమాయకపు ప్రజలను మోసం చేస్తూ నగదు, ఆభరణాలను దోచుకున్నాడు. కడప, నెల్లూరు పోలీసులు పలుమార్లు అరెస్ట్ చేసి జైలుకు పంపినా తొరిగొచ్చాక అతని ప్రవర్తలో మార్పు రాలేదు. ఈ నెల 13న జీజీహెచ్లో చికిత్స నిమిత్తం వచ్చిన వెంకటసుబ్బారెడ్డితో షఫీ తాను పోలీసునని నమ్మించి భయభ్రాంతులకు గురిచేసి వెంకటసుబ్బారెడ్డి చేతి వేళ్లకున్న బంగారు ఉంగరాన్ని తీసుకొని పరారయ్యాడు. తాను మోసపోయానని గ్రహించిన వెంకటసుబ్బారెడ్డి దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ దశరథరామారావు కేసు నమోదు చేసి ఎస్ఐ బాజ్జీబాబు, సిబ్బందితో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం నీలగిరి సంఘం వద్ద నిందితుడిని అరెస్ట్ చేశారు. దర్గామిట్టతో పాటు బాలాజీనగర్, నవాబుపేట, సంతపేట పోలీస్ స్టేషన్ల పరిధిల్లోనూ ఇదే తరహాలో నేరాలకు పాల్పడినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. షఫీ నుంచి రూ.60 వేల నగదు, రూ.28వేల విలువచేసే బంగారు ఉంగరాలు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.