HYD : కోటీశ్వరుడినంటూ కథలు.. ఉదయం బెంగళూరు.. సాయంత్రం Delhiలో.. 1000 మంది అమ్మాయిలు.. ఒక్కసారిగా సీన్ రివర్స్..

ABN , First Publish Date - 2022-05-08T17:08:09+05:30 IST

కోటీశ్వరుడినంటూ కథలు.. ఉదయం బెంగళూరు.. సాయంత్రం Delhiలో.. 1000 మంది అమ్మాయిలు.. ఒక్కసారిగా సీన్ రివర్స్..

HYD : కోటీశ్వరుడినంటూ కథలు.. ఉదయం బెంగళూరు.. సాయంత్రం Delhiలో.. 1000 మంది అమ్మాయిలు.. ఒక్కసారిగా సీన్ రివర్స్..

  • డబ్బున్న అమ్మాయిలే Target.. 
  • సామాజిక మాధ్యమం వేదికగా యువకుడి ఎర 
  • నమ్మించేందుకు వారి ఖాతాల్లోకి ఉదారంగా కొంత డబ్బు
  • తర్వాత ఖాతాలు పనిచేయడం లేదని.. లక్షల్లో కావాలని వల
  • రూ. 2.50 కోట్లు కాజేసిన కేటుగాడు?
  • తెలుగురాష్ట్రాల్లోనే 50 ఫిర్యాదులు.. నిందితుడి అరెస్ట్‌ 

హైదరాబాద్‌ సిటీ : సోషల్‌ మీడియాలో ధనవంతులైన అమ్మాయిలనే లక్ష్యంగా చేసుకొని, మాయచేసి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బుకొట్టేస్తుంటాడా కేటుగాడు. ఇప్పటిదాకా ఎంతోమంది అమ్మాయిలను మోసం చేశాడు. ప్రాథమిక దర్యాప్తులోనే రూ.2.50 కోట్లు కాజేశాడని నిర్ధారించారు. బాధితుల్లో కొందరి ఫిర్యాదుతో నిందితుడిని సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. సైబర్‌ క్రైం పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని రాజమండ్రికి చెందిన జోగడ వంశీకృష్ణ 2014లో B.tech పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం Hyderabadకు వచ్చి కూకట్‌పల్లిలో ఉండేవాడు. గుర్రపు పందాలు, క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యసనంలో మునిగిపోయాడు. ఇందుకు డబ్బులు లేకపోవడంతో కూకట్‌పల్లిలో ఒక ప్రైవేట్‌ ట్రావెల్‌ కార్యాలయంలో పనిచేశాడు. ఆ సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కొంతమందిని మోసం చేసి డబ్బు గుంజాడు. ఈ కేసులో 10 మందితో కలిసి జైలుకెళ్లొచ్చాడు. బయటకొచ్చాక డబ్బు ఎలా సంపాదించాలనేదానిపై పెద్ద స్కెచ్‌ వేశాడు. ఇందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా డబ్బున్న అమ్మాయిలను ఎరవేయాలని పథకం వేశాడు.


డబ్బున్న అమ్మాయిలను తెలుసుకునేందుకు మ్యాట్రిమోనియల్‌ సైట్లలో అమ్మాయిల జాబితా చెక్‌ చేశాడు. వాటి ఆధారంగా వారి ఇన్‌స్టాగ్రామ్‌లను సెర్చ్‌ చేసి డబ్బున్న అమ్మాయిల జాబితాను సిద్ధం చేసేవాడు. అమ్మాయిల పేరుతో కొన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు, హర్షవర్ధన్‌ అనే పేరుతో మరో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా క్రియేట్‌ చేశాడు. తొలుత.. తాను ఎంచుకున్న అమ్మాయిలకు అమ్మాయి పేరుతో ఫ్రెండ్‌ రిక్వెస్టు పంపేవాడు. అలా ఎవరికి వారిని ఫాలోవర్స్‌గా మార్చుకొని వారితో స్నేహం పెంచుకునేవాడు. ఈ క్రమంలో అమ్మాయిల పేర్లతో క్రియేట్‌ చేసిన Instagram నుంచే డబ్బున్న అమ్మాయిలతో హర్షవర్దన్‌ గురించి గొప్పలు చెప్పేవాడు. హర్షవర్దన్‌ ఓ బిలియనీర్‌ అని.. ఆయనకు లెక్కలేనంత డబ్బు ఉందని.. ఎంతోమందికి లక్షల్లో డబ్బు ఉదారంగా ఇస్తుంటాడని,  తానూ ఆయన ఫాలోవర్‌నని చెప్పేవాడు. ఫలితంగా ఎందరో అమ్మాయిలు హర్షవర్థన్‌ ఇన్‌స్టాగ్రామ్‌కు ఫాలోవర్స్‌గా మారిపోయేవారు.


అనంతరం హర్షవర్దన్‌ పేరుతో అమ్మాయిలతో Chatting చేసి పరిచయం పెంచుకునేవాడు. వారితో తాను కోటీశ్వరుడినని నమ్మించి..  ఖర్చులకు వాడుకోండంటూ రూ.లక్ష మేర వారి ఖాతాల్లో వేసేవాడు. తాము అడక్కుండానే రూ. లక్ష ఇస్తుండటంతో నిజంగానే అతడు బిలియనీర్‌ అని అమ్మాయిలు నమ్మేవారు. కొన్నాళ్ల తర్వాత తన బ్యాంకు ఖాతాల్లో ఏదో టెక్నికల్‌ సమస్య తలెత్తిందని, ట్రాన్షక్షన్స్‌ అన్నీ ఆగిపోయాయని అర్జంటుగా డబ్బులు కావాలంటూ  రూ. 10 లక్షల నుంచి రూ. 50లక్షల వరకు అడిగేవాడు. దాంతో అతను చెప్పింది నిజం అని నమ్మిన అమ్మాయిలు వెంటనే వారి స్థాయిని బట్టి రూ. లక్షల్లో అతడికి ఇచ్చేవారు.


ఉదయం బెంగళూరు.. సాయంత్రం ఢిల్లీలో..

తనకు చాలా బ్యాంకు ఖాతాలుంటాయని అమ్మాయిలను వంశీకృష్ణ నమ్మించేవాడు. అయితే ఆ బ్యాంకు ఖాతాలన్నీ క్రికెట్‌ బెట్టింగ్‌, గుర్రపు పందాలు నిర్వహించే ఆర్గనైజర్స్‌వే. వారి ఖాతాల్లో అమ్మాయిలు వేసిన డబ్బును తీసుకొని జల్సాలు చేసేవాడు. క్రికెట్‌ బెట్టింగ్‌లు, గుర్రుపు పందాలు ఆడేవాడు. అందుకోసం బెంగళూరు, చెన్నై, డిల్లీ, కోల్‌కతా, ముంబైకి విమానాల్లో వెళ్లేవాడు. ఉదయం బెంగళూరులో ఉంటే.. సాయంత్రం ఢిల్లీలో ఉండేవాడు. డబ్బులు తీసుకున్న కొద్దిరోజులకు అమ్మాయిల చాటింగ్‌కు రెస్పాండ్‌ అయ్యేవాడు కాదు.


ఇలా రెండేళ్లలో సుమారు 1000 మంది అమ్మాయిలను మోసం చేసి, రూ. కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికి అతడికి 100కు పైగా నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌లు ఉన్నట్లు.. ప్రాథమిక దర్యాప్తులో రూ. 2.50 కోట్లు కొల్లగొట్టినట్లు తేలింది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటి వరకు 50 కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు నిందితుడి ఆటకట్టించడానికి 3 నెలలు కష్టపడాల్సి వచ్చింది. నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు.

Read more