ఛత్తీస్‌గఢ్‌లో పదిమంది ఆదివాసీలు మృతి..

ABN , First Publish Date - 2021-09-16T04:29:20+05:30 IST

భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా పిడియా, పుల్నార్‌ గ్రామాల్లో విషాద సంఘటన జరిగింది.

ఛత్తీస్‌గఢ్‌లో పదిమంది ఆదివాసీలు మృతి..
పిడియా గ్రామం ఇదే..

అంతుచిక్కని వ్యాధితో చనిపోయారని సమాచారం

మీడియాకు విషయాన్ని తెలిపిన గ్రామస్థులు

చర్ల సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో ఘటన

చర్ల, సెప్టెంబర్‌ 15 :  భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా పిడియా, పుల్నార్‌ గ్రామాల్లో విషాద సంఘటన జరిగింది. అంతుచిక్కని వ్యాధిక కారణంగా మంగళ, బుధవారాలు రెండు రోజుల్లో కలిపి సుమారు 10మంది ఆదివాసీలు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆ గ్రామస్థులు.. మీడియాకు బుధవారం ఫోన్‌లో సమాచారం అందించారు. ఇంకా అనేకమంది వ్యాధులతో బాధపడుతున్నారని, వర్షాలు పడుతుండటంతో వాగులు పొంగి ఆసుపత్రికి వెళ్లలేకపోతున్నామని వారు మీడియాకు చెప్పినట్టు తెలుస్తోంది.  ఈ విషయంపై బీజాపూర్‌ వైద్యశాఖకు ఎలాంటి సమాచారం అందలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. మీడియా నుంచి వచ్చిన సమాచారం మేరకు ప్రత్యేక వైద్య బృందాన్ని పంపిస్తామంటున్నారు. ఇదిలా ఉండగా స్థానిక ఆదివాసీలు ఎలా మృతి చెందారు? వారిని కరోనా కబళించిందా? లేదంటే సీజనల్‌ వ్యాధులతో మృతి చెంది ఉంటారా? అనేది తెలియాల్సి ఉంది.  గతేడాది కరోనా ఉధృతి సమయంలోనూ పిడియా గ్రామంలో ఇదే తరహాలో సుమారు ఆరుగురు మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి.  మళ్లీ ఇప్పుడు 10మంది ఆదివాసీలు మృతి చెందారని వార్తలు రావడం చర్చనీయాంశమైంది. అయితే పిడియా, పుల్నార్‌ గ్రామాలు చర్ల మండలానికి కేవలం 30కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 

Updated Date - 2021-09-16T04:29:20+05:30 IST