మహాత్మా గాంధీపై వ్యాఖ్యలు చేసిన స్వామీజీపై కేసు

ABN , First Publish Date - 2021-12-27T19:05:50+05:30 IST

మహాత్మా గాంధీపై అవమానకర వ్యాఖ్యలు చేయడంతోపాటు

మహాత్మా గాంధీపై వ్యాఖ్యలు చేసిన స్వామీజీపై కేసు

రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) : మహాత్మా గాంధీపై అవమానకర వ్యాఖ్యలు చేయడంతోపాటు ఆయనను హత్య చేసిన నాథూరాం గాడ్సేను ప్రశంసించినందుకు కాళీచరణ్ మహరాజ్‌పై రాయ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాయ్‌పూర్ మాజీ మేయర్ ప్రమోద్ దుబే ఫిర్యాదు మేరకు టిక్రపర పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. 


కాళీచరణ్‌పై భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 505(2) (వివిధ వర్గాల మధ్య శత్రుత్వం, విద్వేషం లేదా దురభిప్రాయాలను సృష్టించడం లేదా ప్రోత్సహించడం),  సెక్షన్ 294 (బహిరంగ ప్రదేశంలో అశ్లీలంగా ప్రవర్తించడం) క్రింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 


రాయ్‌పూర్‌లోని రావణ్ భాటా మైదానంలో ఆదివారం జరిగిన ధర్మ సంసద్ సభలో కాళీచరణ్ మాట్లాడుతూ, రాజకీయాల ద్వారా దేశాన్ని స్వాధీనం చేసుకోవాలనేదే ఇస్లాం లక్ష్యమని ఆరోపించారు. గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేకు గౌరవ వందనం చేస్తున్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ సభ నిర్వాహకుల్లో ఒకరైన రామ్ సుందర్ మహరాజ్ (కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే) సభ నుంచి వెళ్లిపోవడంతో, రెండు రోజులపాటు జరగవలసిన ఈ సభ అర్థాంతరంగా నిలిచిపోయింది. కాళీచరణ్ వ్యాఖ్యలను పలువురు రాజకీయ నేతలు ఖండించారు. 


Updated Date - 2021-12-27T19:05:50+05:30 IST