మంత్రి, ఎమ్మెల్యేలతో చీకోటి చాటింగ్‌ !

ABN , First Publish Date - 2022-08-06T08:26:46+05:30 IST

క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ కుమార్‌ను విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు.

మంత్రి, ఎమ్మెల్యేలతో చీకోటి చాటింగ్‌ !

  • క్యాసినో నిర్వాహకుని వాట్సా్‌పలో గుర్తించిన ఈడీ
  • క్యాసినో వ్యాపారం చేశా తప్పేముంది ?: ప్రవీణ్‌  

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ కుమార్‌ను విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలతో చీకోటి ప్రవీణ్‌ వాట్సా్‌పలో చాటింగ్‌ చేసినట్టు గుర్తించారు. ఈ చాట్‌ ఆధారంగా సదరు రాజకీయ నాయకులతో ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ప్రవీణ్‌ ఇచ్చిన సమాధానాల ఆధారంగా, అవసరమైతే ఆ ప్రజాప్రతినిధులను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోపక్క, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు చీకోటి ప్రవీణ్‌ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారనే విషయాన్ని ఈడీ ఇదివరకే గుర్తించింది. కాగా, శుక్రవారం, నాలుగో రోజు విచారణకు హాజరైన చీకోటి ప్రవీణ్‌ను ఈడీ అధికారులు సుమారు గంటన్నర పాటు ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రవీణ్‌.. తాను హైదరాబాద్‌లో పుట్టిపెరగడం వల్లే తనకు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. నేపాల్‌, గోవాల్లో క్యాసినోలు చట్టవ్యతిరేకం కాదని, అక్కడ తాను ఆ వ్యాపారం చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు.  అంతేకాక, తనకు ప్రాణహాని ఉండటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించానని తెలిపారు. 

Updated Date - 2022-08-06T08:26:46+05:30 IST