ఏడు సెక్షన్లతో చార్జిషీటు
ABN , First Publish Date - 2020-07-05T11:22:32+05:30 IST
ఏపీ టూరిజం కార్యాలయంలో దివ్యాంగురాలైన మహిళా ఉద్యోగిపై దాడి చేసిన కేసులో నిందితుడిపై ఏడు సెక్షన్లతో చార్జిషీటు దాఖలు
మహిళా ఉద్యోగినిపై దాడిలో నిందితుడిపై కేసు
దిశ మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ నాగరాజు
నెల్లూరు(క్రైం), జూలై 4: ఏపీ టూరిజం కార్యాలయంలో దివ్యాంగురాలైన మహిళా ఉద్యోగిపై దాడి చేసిన కేసులో నిందితుడిపై ఏడు సెక్షన్లతో చార్జిషీటు దాఖలు చేశామని దిశ మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజు తెలిపారు. నెల్లూరులోని దిశ పోలీసు స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేసంలో డీఎస్పీ ఆ వివరాలు వెల్లడించారు. ‘ గత నెల 27న టూరిజం కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఉషారాణిపై డిప్యూటీ మేనేజరు సీహెచ్ భాస్కర్ చేసిన దాడిపై దర్గామిట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది.
గత నెల 30న ఆ కేసు దిశ పోలీసు స్టేషన్కు బదిలీ అయింది. తరువాత పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాం. సీసీ ఫుటేజ్లు, దాడికి పాల్పడిన వస్తువులను, ఉద్యోగులను విచారించి సాక్షాధారాలను సేకరించాం. నిందితుడుపై ఈనెల 3న సెక్షన్ 324,355,354,509,506, వికలాంగుల హక్కుల చట్టం కింద 92(ఎ), (బీ) కేసులు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశాం’ అని ఆయన వెల్లడించారు.