డీజిల్‌ సెస్‌ పేరుతో చార్జీలు బాదేశారు

ABN , First Publish Date - 2022-07-02T06:40:34+05:30 IST

డీజిల్‌ సెస్‌ పేరుతో ఆర్టీసీ చార్జీలు పెంచడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు అన్నారు.

డీజిల్‌ సెస్‌ పేరుతో చార్జీలు బాదేశారు
ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులు

చిత్తూరు రూరల్‌, జూలై 1: డీజిల్‌ సెస్‌ పేరుతో ఆర్టీసీ చార్జీలు పెంచడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు అన్నారు. చార్జీల పెంపును నిరసిస్తూ శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో సీపీఐ నాయకులు ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు పాదయాత్రలో కరెంట్‌, బస్సు చార్జీలు, పన్నులు పెంచబోనని, ఒక్క అవకాశం ఇవ్వండని వేడుకున్న సీఎం జగన్‌ ప్రస్తుతం అన్ని ధరలు పెంచేశారని విమర్శించారు. పేదలపై భారాలు మోపుతున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. పెరిగిన ధరల కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజల బతుకు భారంగా మారుతోందన్నారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు గోపీనాథ్‌, మణి, సురేంద్రనాథ్‌, రఘు, రమాదేవి పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T06:40:34+05:30 IST